భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన పురస్కారం లభించింది. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత ‘ఆర్డర్ ఆఫ్ ద నైల్’ అవార్డు మోదీని వరించింది. దీనిని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి.. మోదీకి ప్రధానం చేశారు. అవార్డు ప్రదానానికి ముందు అధ్యక్షుడు సిసితో ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు మోదీ. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా మద్బౌలితో చర్చించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాపార, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ, ఫార్మా తదితర రంగాలలో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై చర్చలు జరిపారు.
భారతీయ సైనికులకు మోదీ నివాళులు
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్టు, పాలస్తీనాలో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు ఆర్పించారు. కైరోలోని హెలియోపొలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీని సందర్శించిన మోదీ.. అక్కడి స్మారకం వద్ద పుష్పాలు సమర్పించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 4,000 మంది భారత సైనికులు ఈజిప్టు, పాలస్తీనాలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
పురాతన మసీదు సందర్శన
మరోవైపు కైరోలో అతి పురాతన అల్ హకీమ్ మసీదునూ సందర్శించారు ప్రధాని మోదీ. 11వ శతాబ్దానికి చెందిన మసీదు చారిత్రక, సాంస్కృతిక ప్రదేశంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1012వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. 13,560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మసీదు విస్తరించి ఉంది. భారత్కు చెందిన దావూదీ బోహ్రా సంఘం సహాయంతో ఈ మసీదును పునరుద్ధరించారు. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఇది తొలి ఈజిప్టు పర్యటన.
అంతకుముందు కైరోలో ఈజిప్టు అధ్యక్ష భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి స్వాగతం పలికారు. ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ముఖ్య అతిథిగా విచ్ఛేశారు. ఆయన ఆహ్వానం మేరకే మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. అరబ్, ఆఫ్రికా దేశాల రాజకీయాల్లో ఈజిప్టు ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. ఆఫ్రికా, ఐరోపా మార్కెట్లకు ప్రధాన గేట్వేగానూ ఈ దేశాన్ని పరిగణిస్తారు. అలాంటి ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతోందని మోదీ తెలిపారు.
[vuukle]