బంగారు ఆభరణాలు అందజేత..
తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు బంగారు ఆభరణాలు బహుమతిగా అందజేశారు. ఆదివారం ఉదయం తిరుమల విచ్చేసిన వారు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల వేద పండితులు.. వారికి వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారికి కానుకగా బంగారు తాబేలు, బంగారు శంఖంను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. దాదాపు 2 కిలోల బంగారంతో వాటిని తయారు చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు. టీటీడీ సిబ్బందిని వారు ఆప్యాయంగా పలుకరించారు.
ఆభరణాల విలువ కోటి రూపాయల పైనే..
తమ ఇష్టదైవమైన ఏడుకొండల స్వామిని ప్రతి ఏటా తిరుమల వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని సుధామూర్తి తెలిపారు. 1953లో తొలిసారి తిరుమల కొండకు వచ్చానని.. అప్పటి నుంచి 70 సంవత్సరాలుగా స్వామి దర్శించుకుంటానని ఆమె చెప్పారు. ఎంతో పవిత్రమైన తిరుమల కొండకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని నారాయణమూర్తి పేర్కొన్నారు. తిరుమలలో రోజురోజుకు సౌకార్యాలు పెరుగుతున్నాయన్నారు. శ్రీవారికి కానుకగా అందించిన బంగారు ఆభరణాల విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని సమాచారం.
టీటీడీ సభ్యురాలిగా ఉండడం అదృష్టం..
సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉండడం తన అదృష్టమన్నారు. ఆలయం వెలుపలకు రాగానే కొంతమంది భక్తులు మూర్తి దంపతులతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. అయితే వారికి ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు. ఓ చిన్నారిని దగ్గరికి తీసుకొని ముద్దులాడారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం 87,171 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 38,273 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
[vuukle]