Bharat: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య చిచ్చు రేపుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక భారత్ ప్రమేయముందని..కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. భారత్ హస్తముందని ఆరోపించడంతో పాటు తమ దేశంలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను ఖండించిన భారత్… కెనడాకు బదులిచ్చింది. భారత్లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
కెనడా దౌత్యవేత్తపై రివెంజ్..
ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి కామెరూన్ ఈ రోజు ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు రోజుల్లో దౌత్యవేత్త దేశాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బహిష్కరించినట్లు తెలిపింది. ఈ అంశంపై విలేకరులతో మాట్లాడేందుకు కామెరూన్ నిరాకరించారు.
ఖలిస్తానీ జగడం:
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది. నిజ్జర్ హత్యకు భారత్కు సంబంధం ఉందంటూ కెనడా పార్లమెంట్ వేదికగా ఆ దేశ ప్రధాని ట్రూడో చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ప్రతీకార చర్యగా ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను కెడనా బహిష్కరించింది. అయితే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. అవి నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది.
అసలు ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
ఇంతకీ భారత్, కెనడా మధ్య వివాదం చెలరేగానికి కారణమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ను దుండగులు కాల్చి చంపారు. సర్రేలోని గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ భారత్లోని జలంధర్లో గల భర్సింగ్పురా గ్రామానికి చెందినవారు. 1997లో పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లి ప్లంబర్గా అక్కడే సెటిల్ అయ్యారు. అతనికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. కెనడాకు వలస వచ్చినప్పటి నుంచి అతను ఖలిస్థాన్ మిలిటెన్సీ గ్రూప్లో కీలకంగా పని చేశారు. భారత్ ప్రభుత్వం నిషేదిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్గా కొనసాగారు. నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ లో నిజ్జర్ సభ్యుడు కూడా. నిజ్జర్ను 2020లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్లోని లూథియానాలో 2007లో ఆరుగురు మరణించిన, 40మంది గాయపడిన పేలుడుతో సహా అనేక కేసుల్లో నిజ్జర్ వాంటెడ్గా ఉన్నారు.
Also Read: మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం-రాజ్యసభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు