Heavy Rains : వామ్మో...ఇవేం వానలు...యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక..!!

దేశవ్యాప్తంగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 22 రాష్ట్రాల్లోని 235 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. గుజరాత్, హిమాచల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హథిని కుండ్ బ్యారేజీ  (Hathini Kund Barrage) నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు.

New Update
Heavy Rains : వామ్మో...ఇవేం వానలు...యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక..!!

రుతుపవనాలు మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిగా యాక్టివ్‌గా మారాయి. వీటి ప్రభావం దేశంలోని సగం రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ వరద బీభత్సం (Heavy Rains) కనిపిస్తోంది. మహారాష్ట్రలోని (Maharashtra) యావత్‌మాల్‌లో వరదల్లో చిక్కుకున్న వారిని ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ సాయంతో రక్షించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు.

heavy rains

హిమాచల్‌లోని కోట్‌ఖాయ్‌లో (Kotkhai) వర్షం కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఉజ్జయిని మహాకాల్ ఆలయంలోకి నీరు చేరింది. ఎంపీ బుర్హాన్‌పూర్‌లో తపతి నది ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అంతే కాదు హథిని కుండ్ బ్యారేజీ (Hathini Kund Barrage) నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. మరోవైపు, యూపీలోని పలు జిల్లాల్లో కూడా వరదల వల్ల సమస్యలు పెరిగాయి.

మహారాష్ట్రలో వాన విధ్వంసం:
దేశంలోని 22 రాష్ట్రాల్లోని 235 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ఈరోజు గుజరాత్, హిమాచల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాలు మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించాయి. యావత్మాల్‌లోని 9కి పైగా తహసీల్‌ ప్రాంతాలు వరదముంపులో ఉన్నాయి. యావత్మాల్‌లో, భారీ వర్షాల కారణంగా అనేక రహదారులు మూసుకుపోయాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద, వర్షపు నీరు ప్రజల ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా 5వేలకు మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అదే సమయంలో ఆనంద్ నగర్ (Anand Nagar)వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ను పిలిపించారు. ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ఇర్సాల్ వాడి గ్రామంలో నాల్గవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన 78 మంది గల్లంతయ్యారు, ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికి తీశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై కూడా జలమయమైంది. పలు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

హిమాచల్‌లో విరిగిపడిన కొండచరియలు:
మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ సిమ్లా జిల్లాలోని కోట్‌ఖాయ్ వద్ద భారీ వర్షాల కారణంగా ఖల్తునాలా వద్ద భవనం కూలిపోయింది. అదే సమయంలో, కొండచరియలు విరిగిపడిన శిధిలాలు కోట్‌ఖాయ్ ఆసుపత్రిలోకి ప్రవేశించాయి. సిమ్లాలోని రోహ్రు చిడ్‌గావ్‌లోని లేలాలో మేఘాలు పేలడంతో వచ్చిన శిథిలాల కింద చాలా వాహనాలు కూరుకుపోయాయి. దీంతో పాటు ఓ ఇల్లు కూడా వరదలో చిక్కుకుంది. ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు, అందులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి, ఒకరి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లోని నహాన్‌లో రోడ్డు పక్కన ఆపి ఉంచిన రెండు వాహనాలు కొండచరియలు విరిగిపడటంతో కిందకు పడిపోయాయి. రానున్న 24 గంటల్లో చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మౌర్, బిలాస్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

హత్నీకుండ్ బ్యారేజీ నుంచి విడుదలైన నీరు:
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కురుస్తున్న వర్షాలు మరోసారి ఢిల్లీని ప్రభావితం చేయనున్నాయి. హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. ఈ నీరు నేడు ఢిల్లీకి చేరుకోనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలా ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో హిండన్ నది బీభత్సం సృష్టిస్తోంది. హిండన్‌లో నీటిమట్టం పెరగడంతో నది ఒడ్డున ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పంజాబ్‌లోని జలంధర్‌లో గంటల తరబడి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలో అనేక అడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల తర్వాత నదుల్లో ఉధృతంగా ప్రవహించడంతో అయోధ్య ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి సరయూలో వరద ఉధృతంగా ప్రవహించడంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఘాట్‌ల వాగులు నీట మునిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు:
ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగా, ఏపీలోకూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వానముసురు పట్టింది. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలకు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. అయా జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్నరోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు