క్షణికావేశంలో కొన్ని డైలాగ్స్ చెబుతుంటాం. నీ రక్తాన్ని కళ్లజూస్తా…నీ రక్తం తాగుతా..నీ అంతు చూస్తా..ఇలాంటి డైలాగ్స్ చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఓ వ్యక్తి నిజంగానే ఈ పనిచేశాడు. ఓ వ్యక్తి గొంతు కోసం..అతని రక్తాన్ని తాగాడు. ఈ దారుణమైన ఘటన కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…కర్నాటకలోని చింతామణికి చెందిన విజయ్, చేలూరుకు చెందిన మారేష్ ఇద్దరూ కూడా కలిసి వ్యాపారం చేస్తుంటారు. వీరిద్దరూ చింతామణి పట్టణంలో వస్త్రాలు,గాజులు అమ్ముతుంటారు. అయితే మారేష్ పై విజయ్ కు అనుమానం కలిగింది. వ్యాపారం విషయంలో కాదు. తన భార్యతో మారేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు విజయ్ అనుమానించాడు.
తనకు వచ్చిన అనుమానంతో తన మార్గాల్తో తాను ఎంక్వైరీ చేసుకుని వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని నిజనిర్దారణ చేసుకున్నాడు. దీంతో మరోక స్నేహితుడితో కలిసి మారేష్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లుగా మారేష్ కు ఫోన్ చేసి సిద్ధాపుర క్రాస్ రోడ్స్ కు రమ్మని చెప్పాడు. అయితే పిలిచింది తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి కావడంతో మారేష్ వెళ్లాడు. క్రాస్ రోడ్స్ దగ్గరకు వెళ్లిన వెంటనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ మారేష్ ను నిలదీశాడు విజయ్.
మారేష్ సమాధానం చెప్పేలోపే తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో మారేష్ గొంతు కోశాడు. దారుణంగా కొట్టాడు. దీంతో మారేష్ కిందపడిపోయాడు. మారేష్ గొంతులో నుంచి వస్తున్న రక్తాన్ని …విజయ్ తన గొంతు పెట్టి తాగాడు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా విజయ్ వెంట వచ్చిన మరో స్నేహితుడు జాన్ బాబు వీడియో తీశాడు. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో అటు ఇటు చేతులు మారి సోషల్ మీడియాకు చేరింది. రక్తం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వగానే నెటిజన్లు షాక్ కు గురయ్యారు.
కాగా ఈ ప్రమాదం నుంచి మారేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. గాయం మరీ పెద్దది కాకపోవడంతో..మారేష్ ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజులపాటు చికిత్స పొందిన మారేష్ డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ పై కేసు పెట్టాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.