టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది. కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి బయల్దేరారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రాలతో పూర్తిగా కప్పి ఉంచారు.
ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును కూడా తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తల్లిదండ్రుల మాదిరే తాము కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యామని చెప్పుకొచ్చారు.