Heritage Shares: హెరిటేజ్ షేర్ల ధర పడిపోతోంది.. ఎందుకు ఇలా?

హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఒక దశలో 727 రూపాయలకు చేరిన షేర్ ధర.. క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం 601.35 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హెరిటేజ్ షేర్ల ధర తగ్గడానికి కారణం ప్రాఫిట్ బుకింగ్ గా నిపుణులు చెబుతున్నారు. 

New Update
Heritage Shares: హెరిటేజ్ షేర్ల ధర పడిపోతోంది.. ఎందుకు ఇలా?

Heritage Shares: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రమోటర్స్ గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల ధర క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి వరుసగా ఆరు సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ చూపి.. ఆల్ టైమ్ హై కి చేరిన షేర్ విలువ క్రమంగా తగ్గుతోంది. వరుసగా నాలుగు సెషన్స్ లో హెరిటేజ్ షేర్ల విలువ పతనం దిశలోనే సాగుతూ వచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి 35.71% వాటా ఉంది. 

ఏం జరిగింది..
Heritage Shares: నిజానికి మే 2వ తేదీన హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర రూ.333.85లుగా ఉంది. అక్కడ నుంచి క్రమేపీ పెరుగుతూ ఎన్నికల తరువాత ఫలితాల విడుదల ముందు రోజు  జూన్ 3వ తేదీ నాటికి రూ.441లకు చేరుకుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రూ.479.80 లకు టచ్ అయింది. అక్కడ నుంచి షేర్ దాహర వేగంగా పెరుగుతూ జూన్ 10వ తేదీ నాటికి రూ.727.35ల హై నమోదు చేసింది. దీంతో ఈ షేర్లలో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలు వచ్చాయి. అయితే, ఆ తరువాత నుంచి హెరిటేజ్ షేర్లలో తగ్గుదల నమోదు కావడం ప్రారంభం అయింది. 11, 12 తేదీల్లో షేర్ పతనం అయింది. 12వ తేదీన రూ.627.30లుగా నమోదు అయింది. ఇక ఈరోజు కూడా హెరిటేజ్ షేర్ల ధర తగ్గుతూ వస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి రూ.601.35ల వద్ద నమోదు అవుతోంది. 

చంద్రబాబు కుటుంబంలో ఎవరి వాటా ఎంత?
Heritage Shares: హెరిటేజ్ లో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి అత్యధికంగా 24.37% వాటా ఉంది. కుమారుడు లోకేష్‌ కు 10.82%, కోడలు బ్రాహ్మణికి 0.46% వాటా ఉంది. అలాగే ఆయన మనవడు దేవాన్ష్‌కు 0.06% వాటా ఉంది. మొత్తంగా చూసుకుంటే,  చంద్రబాబు నాయుడు కుటుంబానికి కంపెనీలో 35.71% వాటా ఉంది. 

ఎందుకిలా?
Heritage Shares: గత ఆర్ధిక సంవత్సరంలో అంటే 2023-24లో హెరిటేజ్ ఫుడ్స్ లాభాలను ఆర్జించింది. బీఎస్ఈ వెబ్ సైట్ లో కంపెనీ వివరాల ప్రకారం 2023 జూన్ త్రైమాసికానికి 916 కోట్ల రూపాయల ఆదాయం.. 18.07 కోట్ల లాభం వచ్చింది. అదేవిధంగా 2023 సెప్టెంబర్ త్రైమాసికానికి 964.62 ఆదాయం.. 22.52 కోట్ల రూపాయల లాభం, 2023 డిసెంబర్ త్రైమాసికానికి 925.45 కోట్ల ఆదాయం.. 27.10 కోట్ల రూపాయల లాభం, 2024 మర్చి త్రైమాసికానికి 940.13 కోట్ల ఆదాయం 23.34 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ క్రమంలోనే షేర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ ఎమోషనల్ పిరియడ్ లో హెరిటేజ్ షేర్ల ధర ఒక్కసారిగా పెరిగింది. ఒక్కోషెర్ కు దాదాపు 300 రూపాయల వరకూ (మే నెలతో పోలిస్తే) పెరగడంతో తరువాత షేర్లను ఆ లాభం వద్ద అమ్ముకోవడం మొదలైంది. దీంతో షేర్ ధర పడిపోతూ వస్తోంది. ఇన్వెస్టర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ధోరణి దీనికి కారణంగా చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం హెరిటేజ్ షేర్లు లోయర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పవచ్చు. 

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఈ ఆర్టికల్ కేవలం ఆసక్తి కలిగిన పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వివిధ వెబ్సైట్స్.. నిపుణులు ఇచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ఏదైనా షేర్లను కొనమని కానీ.. అమ్మమని కానీ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని కానీ సూచించడం లేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడినవి. అందువల్ల పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారుని సూచనలు తీసుకోవడం మంచిది. 

Advertisment
తాజా కథనాలు