దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లోనూ వర్షం కురుస్తోంది. ఐతే మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎప్పుడూ బిజీగా ఉండే అంధేరీ సబ్వే నీట మునిగిపోయింది. ఒకటిన్నర నుంచి 2 అడుగుల మేర నీరు చేరడంతో ట్రాఫిక్ను దారి మళ్లించారు. సెంట్రల్, వెస్టర్న్ రూట్స్లో లోకల్ ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఇక పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఐతే మరో రెండ్రోజులు ముంబైని ఇంకా వర్షాలు ముంచెత్తుతాయని..కోస్టల్ ఏరియాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది IMD.
బిపర్జాయ్ తుఫాన్ ప్రభావంతో రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. ఐతే ఆ తర్వాత పుంజుకొని దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఏడాది ఢిల్లీ, ముంబైని ఒకేసారి తాకాయి నైరుతి రుతుపవనాలు. నాలుగు రోజుల క్రితం అటు దేశ రాజధాని, ఇటు వాణిజ్య రాజధానిలోకి ప్రవేశించిన మాన్సూన్స్ ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. ఐతే ఇలా ఒకేసారి రుతుపవనాలు ప్రవేశించడం 1961లో జరిగిందట. ఆ తర్వాత ఈ ఏడాదే ఇలా జరిగిందని అంటున్నారు నిపుణులు. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, ముంబైతో పాటు హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, యూపీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి.
అటు గోవాలో రెండ్రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పనాజీలోని పలు ప్రాంతాల్లో, 18వ జూన్ రోడ్, మాలా ఏరియాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జులై 1 వరకు దక్షిణ మహారాష్ట్ర – గోవా తీరం వెంట గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.