నిత్యం బిజీబిజీగా గడిపే ప్రధాని మోదీ ఇప్పుడు మరింత బిజీ అయ్యారు. రేపు, ఎల్లుండి జీ20 సమ్మిట్ ఉండడంతో మోదీ షెడ్యూల్ చాలా టైట్ అయ్యింది. ఈ సమ్మిట్కి హాజరయ్యేందుకు ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు వస్తుండడంతో వారితో భేటీకి మోదీ సిద్ధమయ్యారు. ప్రపంచ నేతలతో ఈ మూడు రోజుల్లోనే మోదీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 8(ఇవాళ) మారిషస్, బంగ్లాదేశ్, అమెరికా నాయకులతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు(సెప్టెంబరు 9న).. జీ20 సమావేశాలతో పాటు, UK, జపాన్, జర్మనీ, ఇటలీతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. ఎల్లుండి(సెప్టెంబర్ 10) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ప్రధాని లంచ్ మీటింగ్ ఉంది. కెనడాతో పుల్-అసైడ్ మీటింగ్, కొమొరోస్, టర్కీ, యూఏఈ(UAE), దక్షిణ కొరియా, EU/EC, బ్రెజిల్ , నైజీరియాలతో ద్వైపాక్షిక భేటీ ఉంది. ఇక జీ20 సమావేశాల ముందు మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ వైపు పయనించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
This browser does not support the video element.
ఫొకస్గా వస్తున్నా:
స్పష్టమైన దృష్టితో జీ20 సమ్మిట్కు వెళుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం, అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడం ఈ చర్య అందులో భాగమేనన్నారు. పుతిన్ మరోసారి జీ20 సమావేశాలకు దూరంగా ఉన్నారని.. మీరంతా యుక్రెయిన్కు మద్దతుగా నిలవండంటూ ట్వీట్ చేశారు సునాక్.
విందుకు హాజరుకావడంలేదు:
ఆరోగ్య కారణాల రీత్యా సెప్టెంబర్ 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 విందుకు తాను హాజరు కావడం లేదని భారత మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ తెలిపారు. 'ఈ విషయాన్ని నేను ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాను' జీ20 సదస్సు గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు జీ20 సమావేశాల కారణంగా ఢిల్లీలో పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. గూడ్స్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, అంతర్ రాష్ట్ర బస్సులు, స్థానిక సిటీ బస్సులతో సహా వివిధ రకాల వాహనాలు మధుర రోడ్ (ఆశ్రమ చౌక్ దాటి), భైరాన్ రోడ్, పురానా క్విలా రోడ్, ప్రగతి మైదాన్ లోపల నడపడానికి అనుమతించరు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 వరకు ఈ రూల్స్ పాటించాలి. పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామాగ్రి లాంటి నిత్యావసర వస్తువులను రవాణా చేసే గూడ్స్ వాహనాలతో పాటు చెల్లుబాటు అయ్యే ‘నో ఎంట్రీ పర్మిషన్స్’తో ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. ఇక న్యూఢిల్లీ జిల్లాలోని మొత్తం ప్రాంతం సెప్టెంబర్ 8(ఇవాళ) ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ‘నియంత్రిత జోన్-I’గా గుర్తించారు. అయితే.. ఢిల్లీలో ఇప్పటికే ఉన్న బస్సులతో సహా అన్ని రకాల వాణిజ్య వాహనాలు రింగ్ రోడ్, రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దుల వైపు రోడ్ నెట్వర్క్లో ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు.
ALSO READ: పెళ్లి కూతురిలా ముస్తాబైన ఢిల్లీ.. వైరల్గా మారిన ఫొటోలు, వీడియోలు..!