బ్రతుకుదెరువు కోసం వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 79 మంది అక్కడికక్కడే నీటిలో జల సమాధి కాగా, వందలాది మంది మునిగిపోయి గల్లంతయ్యారు. గ్రీస్ తీరంలో జరిగిన ఈ ఘటన ఇటీవలి కాలంలో ఐరోపాలో జరిగిన ఘోర విపత్తులలో ఒకటిగా మిగిలిపోనుంది. అయితే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ప్రాణాలతో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. యూరోపియన్ రెస్క్యూ సపోర్ట్ చారిటీ ప్రకారం పడవలో సామర్థ్యానికి మించి 750 మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. అయితే, ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ మాత్రం ఆ సంఖ్యను 400గా చెబుతోంది.
లిబియా నుంచి బయలుదేరిన పడవ మార్గమధ్యంలో మునిగిపోగా 104 మందిని రక్షించారు. వలసదారుల్లో చాలామంది ఈజిప్ట్, సిరియా, పాకిస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం నుంచి రక్షించిన వారిని పైలోస్లోని గ్రీక్ ఓడరేవు కలమటకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అక్కడే వారికి చికిత్సతో పాటుగా.. తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీలోని కలాబ్రియన్ తీరంలో ఓ పడవ తుపాను కారణంగా రాళ్లను ఢీకొట్టడంతో మునిగిపోయి 96 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే మళ్లీ ఘటన జరగడంతో అందరిని కలిచివేస్తోంది.