రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన నేడు గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూ యజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ అయింది. వానాకాలం సాగుకు సంబంధించిన పంటసాయం ఈనెల 26 నుంచి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దానికి సంబంధించిన ప్రక్రియను మరింత వేగవంతం చేసి సోమవారం ఉదయాన్నే రైతుల ఖాతాల్లో జమ అయ్యేట్లు అన్ని చర్యలు తీసుకున్నారు.
ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. గతంతో పోల్చితే ఈ సీజన్లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు అందిస్తున్నది. రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనుంది. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడుతున్నది. ఈ సీజన్తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమయినట్లవుతుంది. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.