DL Ravindra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు స్కామే లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రిమాండ్ విధించడం దారుణమన్నారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్లు లేదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తి ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఎక్కడికీ పారిపోతారు..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 73 ఏళ్ల వయసులో ఎక్కడికీ పారిపోతారని ప్రశ్నించారు. ఎప్పుడు పిలిచినా కోర్టుకు హాజరై సహకరించే వ్యక్తి అని తెలిపారు. నంద్యాలలో అరెస్టు చేసి అక్కడ స్థానిక కోర్టులో హాజరుపెట్టకుండా విజయవాడకి ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని.. జగన్ గతంలో ఓటేసినందుకు తన చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తిందంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని న్యాయవ్యవస్థ పున:పరిశీలించాలని కోరారు.
ఇది కూడా చదవండి: మా నాన్నని ఎలా ఇరికించారంటే..?
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచిన డీఎల్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో డీఎల్ కూడా సైలెంట్ అయిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్పై తీవ్ర విమర్శలు చేసిన డీఎల్.. 2019 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మద్దతుగా అరెస్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఇది కూడా చదవండి: అవినీతి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు