బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీకి గ్రామస్థులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సిర్గాపూర్ జడ్పీ హైస్కూల్ లో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న సంగ్రామ్ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని దుర్భాషలాడి అసభ్యంగా ప్రవర్తించాడు.
పీఈటీ, హెచ్.ఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్ధుల డిమాండ్
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లి జరిగిన దాని గురించి ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరుతుండగా, అంతలోనే పీఈటీ అక్కడికి వచ్చాడు. దీంతో వారు పీఈటీని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో హెచ్.ఎం ఎదుటే దేహశుద్ధి చేశారు. తమ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హెచ్.ఎంపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పీఈటీ,హెచ్.ఎం సస్పెండ్
లేదంటే ఆ పీఈటీని తమకు అప్పగించాలంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే విషయమై ఎన్నిసార్లు హెచ్.ఎంకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పీఈటీని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ, హెచ్.ఎంను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శరత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.