/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-2025-11-03-17-14-57.jpg)
chevella bus accident
Chevella Bus Accident: అయ్యో దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నా పిల్లలు లేకుండా నేను బ్రతికేదేలా! నా పిల్లల్ని నాకివ్వండయ్యా అంటూ బోరున విలపిస్తున్న ఈ తల్లి ఆవేదన గుండెల్ని పిండేస్తుంది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ విషాదకర ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ పని చేస్తూ తన ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాడు. ఓ పెళ్లి వేడుక కోసం గతనెల 17న ఇంటికి వచ్చిన తనూషా, సాయి ప్రియా, నందిని తిరిగి వెళ్తుండగా.. అనుకోని ఈ ప్రమాదం వారి జీవితాలను చీకటి చేసింది.
వెంటాడిన మృత్యువు
మృత్యువు ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. ఈరోజు ట్రైన్ లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు.. ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు. అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు. ఐదు నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చింది. ఈ పరీక్ష ఉందని చెప్పడంతో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను ఉదయాన్నే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు. కానీ, అప్పటికే కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్సై పోయింది. దీంతో ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్లను తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కించాడు.
అలా కూతుళ్లను బస్సు ఎక్కించి.. ఇంటికి వెళ్లి ఓ కునుకు తీశాడు.. ఇంతలోనే గుండె పగిలే వార్త విన్నాడు! తాండూరు నుంచి ఉదయం 4.40 గంటల ప్రాంతంలో నుంచి బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య ముగ్గురు కూతుళ్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిడ్డల మరణ వార్త ఆ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచింది. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుళ్లు ఇక లేరని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికందిన ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ఆ కన్నవారి భాద అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఎల్లయ్యకు మొత్తం నలుగురు సంతానం కాగా.. వారిలో మొదటి కూతురికి వివాహమైంది. మిగతా ముగ్గురు కుమార్తెలు సాయి ప్రియా, నందిని హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. తనూషా ఎంబీఏ చదువుతోంది. నందిని డిగ్రీ మొదటి సంవత్సరం, సాయి ప్రియా డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. తనూష ఎంబీఏ పూర్తి కావడానికి వచ్చింది. త్వరలోనే జాబ్ కూడా వస్తుందని తల్లికి చెప్పిందట! మిగతా ఇద్దరిపై కూడా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదం వారి కలల్ని చిదిమేసింది.
Also Read: ముగ్గురు బిడ్డల మరణంతో సొమ్మసిల్లిన తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
 Follow Us