Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయభేరి సభలతో బిజీబిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతతో మాట్లాడి వారితో కలిసి టీ తాగుతూ సమస్యలు తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్ష వాయిదా వంటి అంశాలను నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో యువత ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీఇచ్చారు. యువత, విద్యార్థులు అధైర్యపడొద్దని కోరారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన జాబ్ క్యాలెండర్ను వివరించారు. అనంతరం ఓ రెస్టారెంట్ కు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి సిబ్బంది, కస్టమర్లతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు
ఇటీవలే మంత్రి కేటీఆర్ (KTR) నిరుద్యోగులను కలిసి వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని, జిల్లాకో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఆ సమావేశంలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన నిరుద్యోగ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మేనిఫెస్టోల్లోనూ ఈ అంశానికి రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయి.