రాహుల్‌కు మళ్లీ అదే బంగ్లా కేటాయిస్తారా? అందరి చూపు హౌస్ కమిటీ పైనే

పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించింది. మరి ఖాళీ చేయించిన బంగ్లా కేటాయింపుపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.

రాహుల్‌కు మళ్లీ అదే బంగ్లా కేటాయిస్తారా?  అందరి చూపు హౌస్  కమిటీ పైనే
New Update

రాహుల్‌కు బంగ్లా కేటాయింపు..!

భారత జోడో యాత్రతో దేశ ప్రజల్లో రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున ఆదరణ పెరిగింది. అదే సమయంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో సానుభూతి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆయన పడిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న బంగ్లాను మాత్రం ఇంకా కేటాయించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్‌కు బంగ్లాను లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించినట్టు తెలుస్తోంది.

ఏప్రిల్‌లో బంగ్లా ఖాళీ చేసిన రాహుల్..

రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన తర్వాత లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో తుగ్లక్ రోడ్డులోని అధికారిక బంగ్లాను రాహుల్‌ ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లోగా బంగ్లాను ఖాళీ చేయాలని గత ఏప్రిల్‌లో లోక్‌‌సభ హౌస్ కమిటీ నోటీసులు జారీచేసింది. దీంతో 2005 నుంచి అక్కడే ఉంటున్న రాహుల్.. ఆ బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లా నుంచి బయటకు వెళ్తూ నిజం మాట్లాడినందుకు శిక్ష వేశారు.. దేశ ప్రజలు తనకు ఇచ్చిన బంగ్లాను లాగేసుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ అదే బంగ్లాను కేటాయిస్తూ హౌస్ కమిటీ నిర్ణయం తీసుకుందని సమాచారం. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించడంతో ఆ బంగ్లా కేటాయిస్తారా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది.

పార్లమెంట్‌ హౌసింగ్‌ కమిటీకి లేఖ..

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరించడంతో తుగ్లక్‌ రోడ్డులో ఉన్న బంగ్లానే తిరిగి కేటాయించాలని.. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పార్లమెంట్‌ హౌసింగ్‌ కమిటీకి లేఖ రాశారు. అయితే ఆ బంగ్లాను రాహుల్‌ ఖాళీ చేసిన తర్వాత ఎవరికీ ప్రభుత్వం కేటాయించకపోవడంతో తిరిగి ఆయనకే ఇచ్చినట్టు తెలుస్తోంది.

2019 సాధారణ ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీతో పాటు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా.. వయనాడ్ నుంచి మాత్రం ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి వయనాడ్ ఎంపీగా పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్.. పరువు నష్టం కేసులో అనర్హత వేటుతో ఐదు నెలల నుంచి అనధికార ఎంపీగా ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్టేతో లోక్ సభ సచివాలయం అనర్హత వేటును ఎత్తివేయడంతో మళ్లీ వయనాడ్ ఎంపీగా కమ్ బ్యాక్ ఇచ్చారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe