KALESWARAM VICHARANA: కాళేశ్వరం ,విద్యుత్ ప్రాజేక్టులపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులపై విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం పై ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించనుంది. డిజైన్, నిర్మాణంలో లోపాలు, కాంట్రాక్టులు ఇవ్వడం, వాటి అమలులో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా లేదా అనేది తేల్చడం లాంటి మొత్తం 9 అంశాలపై న్యాయ విచారణ చేయనుంది. బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్మించిన కాళేళ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 100 రోజుల్లో రెండు కమిషన్లతో విచారణ పూర్తిచేయాలని కోరింది.
కాళేశ్వరం ప్రాజేక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత..దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్ట్ లో ప్రకటించింది.. ఇటీవలె అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాటిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి శ్వేతపత్రం విడుదల చేసింది. జ్యుడీషియల్ కమిషన్ వేసి, అవినీతిని బట్టబయలు చేస్తామంటూ అప్పట్లో సీఎం రేవంత్ ప్రకటించారు. తాజాగా కేబినెట్ సమావేశంలో ఈ అంశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ చైర్మన్గా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని నియమించారు.