AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గుడ్ న్యూస్. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా చేయనున్నారు. డిసెంబర్ 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జనవరిలోగా ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు.

New Update
AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ!

YSR Arogyasri Scheme: ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద పేద ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ పథకాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు సీఎం జగన్. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. అంతేకాదు.. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు సీఎం. అందుకే.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని, విశేష కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు సీఎం జగన్.

ఈ పథకంలో భాగంగా చికిత్స పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలన్నారు. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని చెప్పారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం.

ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగులుగా గుర్తించిన వారికి ఆస్పత్రులకు వెళ్లేందుకు రూ.500లు ఇవ్వాలని ఇదివరకే సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను ప్రజలందరికీ పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ కూడా ఈ వీడియోను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు.

డిసెంబర్ 18న వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. 19న ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి కార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తి కానుంది. దీంతోపాటు వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్న దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓ, ఆశావర్కర్లు, వాలంటీర్, మహిళా పోలీసులు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ సహా, ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రతి మొబైల్‌లో వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్‌ చేస్తారు. పనిలోపనిగా దిశయాప్‌ను కూడా డౌన్లోడ్‌ చేస్తారు. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొంటారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీని ఎలా వినియోంచుకోవాలన్నదానిపైనే కాకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నవారికి చేయూత నివ్వడం, అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం, చికిత్స పొందుతున్న వారికి సకాలంలో మందులు ఇవ్వడం లాంటి అంశాలపైనా ఈ కార్యక్రమంలో భాగంగా దృష్టిపెడతారు.

ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభం..

ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేయనున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. అర్బన్‌ ప్రాంతాల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలన్నారు సీఎం. డయాలసిస్‌ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డ్యాక్టర్‌ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు. మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతోపాటు యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ కూడా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

Also Read:

పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవే..!!

Advertisment
తాజా కథనాలు