Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఏం చేస్తున్నాడంటే??

విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తన స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహ ప్రవేశం చేసి గ్రామస్థులతో వేడుక జరిపారు. ఈ సందర్భంగా తన దేవరకొండ ట్రస్ట్ ద్వారా అచ్చంపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు.

New Update
Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లి తర్వాత తీసుకున్న ఒక మంచి నిర్ణయంతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. రష్మిక మందన్నతో వివాహం జరిగిన అనంతరం, ఆయన తన స్వగ్రామమైన తుమ్మన్‌పేట (తెలంగాణ)కు వెళ్లి గ్రామస్థులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు..

కొత్తగా నిర్మించిన ఇంటిలో విజయ్, రష్మిక కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. గృహ ప్రవేశం కార్యక్రమం కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో విజయ్ తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్, తనకు సొంత ఊరిపై ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. “మా నాన్న ఎప్పటినుంచో ఊరిలో ఇల్లు కట్టాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నా పెళ్లి, ఇల్లు పూర్తవడం ఒకేసారి జరగడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. ఇకపై తరచూ గ్రామానికి వస్తానని, తమ్ముడు ఆనంద్ పెళ్లిని కూడా ఇక్కడే అందరి సమక్షంలో చేస్తానని హామీ ఇచ్చారు.

అదే వేదికపై ఆయన ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తన దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని తెలిపారు. చదువులో మంచి ప్రతిభ చూపించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది.

ఇక విజయ్-రష్మిక జంట మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనుంది. ఈ వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి తర్వాత సొంత ఊరికి మంచి కానుక అందించిన విజయ్‌పై అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు