Ramayana: 'రామాయణ’ కోసం రంగంలోకి క్రిస్టఫర్ నోలన్..? ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే..!

‘రామాయణ’ సినిమాకు క్రిస్టఫర్ నోలన్ ఎడిటింగ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్‌ను శాన్ డియాగో కామిక్-కాన్‌లో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 2026 దీపావళికి విడుదల కానుంది.

New Update
Ramayana

Ramayana

Ramayana: భారీ పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా గురించి కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, సినిమాటోగ్రాఫర్ హోయ్ట్ వాన్ హోయ్టెమా(Hoyte van Hoytema) ఫైనల్ ఎడిటింగ్ పనులను చూసే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన డీఎన్ఈజీ సంస్థ, నోలన్ తీసిన పలు హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ పని చేసింది. అందుకే ఈ రెండు టీమ్‌లు కలిసి పని చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరోవైపు నోలన్ తన కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ పనుల్లో బిజీగా ఉన్నారని, అది 2026 జూలైలో విడుదల కానుందని సమాచారం. అందువల్ల ఆయనకు సమయం దొరకుతుందా అనే సందేహం కూడా ఉంది.

నోలన్ నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర పోషిస్తే, ‘రామాయణ’కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ‘రామాయణ’ ట్రైలర్‌ను జూలైలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ వేదికపై విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా అక్కడ హాలీవుడ్ పెద్ద సినిమాల ట్రైలర్లు విడుదల అవుతాయి. అలాంటి వేదికపై భారతీయ పురాణ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ట్రైలర్ ప్రదర్శించడం ఒక పెద్ద విషయం.

ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడ చూపించిన కొన్ని సన్నివేశాలకు మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయట.

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యష్ కనిపించనున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అలాగే అరుణ్ గోవిల్, కునాల్ కపూర్, ఆదినాథ్ కొఠారే, షీబా చద్దా, ఇందిరా కృష్ణన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

‘రామాయణ’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద ప్రభావం చూపాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisment
తాజా కథనాలు