Chandrababu: చంద్రబాబు రిమాండ్ విషయమై ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వాదనలు అనంతరం చంద్రబాబు కోర్టు లోపల కూర్చుని ఉన్నారు. చంద్రబాబుతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. మరోవైపు టీడీపీ యువనేత లోకేష్ ఓపెన్ కోర్టులో న్యాయవాదులతో చర్చిస్తూ బిజీగా ఉన్నారు.
మరోవైపు లాయర్లతో చంద్రబాబు చర్చిస్తున్నారు. కొంతమంది న్యాయవాదులు బాబుతో ఫొటోలు దిగుతున్నారు.
అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాతో ఎంపీ కేశినేని, చంద్రబాబు తీవ్రంగా చర్చిస్తున్నారు.
వాడివేడి వాదనలు జరుగుతుండగా కోర్టు హాల్ లో చంద్రబాబు కూర్చుని దీర్ఘంగా వాదనలు వింటున్నారు.
ఇంకోవైపు టీడీడీ యువనేత నారా లోకేష్ ఓపెన్ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో చర్చిస్తూ బిజీబీజీగా ఉన్నారు. మొత్తానికి న్యాయమూర్తి తీర్పుపై అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు..
మరోవైపు చంద్రబాబు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని.. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్కు 2015-16 బడ్జెట్లో నిధులు కేటాయించామని.. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని వాదించారు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్ లో తనపేరు లేదని.. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని బాబు తన వాదనల్లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు వెల్లడించారు.