Challa Vamshi: తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దే..చేతగానితనంతోనే ఇలా చేశారు: చల్లా వంశీ

కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఆధారాలతో బయటపెట్టేందుకే లేఖ రాసినట్టు తెలిపారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Challa Vamshi: తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దే..చేతగానితనంతోనే ఇలా చేశారు: చల్లా వంశీ
New Update

Challa Vamshi Chand Reddy: కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన శాశ్వత అన్యాయాన్ని ఆధారాలతో బయటపెట్టేందుకే లేఖ రాసినట్టు తెలిపారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి. కృష్ణా జలాలపై హక్కులను చేతగానితనంతో వదులుకొని… తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ వాటాగా న్యాయంగా రావాల్సింది 575 టీఎంసీలు అయితే… కేసీఆర్ 299 టీఎంసీలకే కేంద్రం వద్ద అంగీకరించారని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గించుకుంటూ 2016, జూన్ 21 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకం పెట్టారన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన వాటాను వదులుకొని…క్రిష్ణా పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు కట్టకుండా… పెండింగు పనులు పూర్తి చేయకుండా తెలంగాణను బీడు చేసిన చరిత్ర కేసీఆర్ దని పేర్కొన్నారు.

సందర్శన పేరుతో సర్కస్..

కమిషన్ల కోసం కాళేశ్వరం పేరుతో నకిలీ కట్టడాలు చూపించి కేసీఆర్ వేల కోట్లు లూటీ చేశారన్నారు. మేడిగడ్డ సందర్శన పేరుతో బీఆర్ఎస్ చేసే సర్కస్ ఫీట్లను తెలంగాణ అసహ్యించుకుంటోందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే… క్రిష్ణా జలాల్లో న్యాయమైన వాటా తెలంగాణకు దక్కే అవకాశం ఉండేదన్నారు. ఎస్ఎల్బీసీ, ఆర్డీఎస్ విస్తరణ, మహబూబ్ నగర్ లోని 10 టీఎంసీ ల ఎత్తిపోతల పథకాలు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, బీమా లిఫ్ట్ లను ఎందుకు నిర్లక్ష్యం చేశారో కేసీఆర్ తెలంగాణకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి హక్కు, వినియోగ సామర్థ్యం, ప్రజా అవసరాలను వివరిస్తేనే నదీ జలాల్లో రాష్ట్రానికి వాటాలు దక్కుతాయన్న ఇంగితం కూడా కేసీఆర్ లేదని దుయ్యబట్టారు.

Also Read: డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి…

నమ్మక ద్రోహి..

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వదులుకొని… ఏపీ జలదోపిడీకి కేసీఆర్ కాపలా కాశారని విమర్శించారు. ఆగస్టు 2020లో ఏపీ సంగమేశ్వర టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సహకరించారన్నారు. కేంద్రానికి లేఖ రాసి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని తెలిపారు. పదేండ్ల కాలంలో కృష్ణా జలాల కోసం ఏపీ 8 ప్రాజెక్టులు, స్కీములు పెడితే… కేసీఆర్ చేసింది మాత్రం గుండుసున్న అని ఫైర్ అయ్యారు. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఒకటి కాదు రెండుసార్లు కేసీఆర్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 మే 27న, మళ్లీ 2023 మే 19న కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ అంగీకారం తెలిపిన మాట వందకు వందశాతం నిజమని.. ఆధారాలు కూడా ఉన్నాయని వివరించారు. రాజకీయంగా పునర్జన్మనిచ్చిన పాలమూరుకు తీరని ద్రోహం చేసిన నమ్మక ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. 2009లో ఎంపీగా గెలిచేందుకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయని దగుల్బాజీతనం కేసీఆర్ దని ధ్వజమెత్తారు.

ఆగమేఘాల మీద..

సంగం బండ రిజర్వాయర్ లో బండ పగలగొడితే 20 వేల ఎకరాలకు నీరు అందుతుంది అని మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సంగం బండ బాధితులకు న్యాయం చేస్తూ, ఆగమేఘాల మీద నిధుల విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సంగం బండ సమస్య తీరుస్తామని, బండ పగలగొడతామని పాదయాత్రలో హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే మాట నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. పాలమూరుకు కేసీఆర్ పదేండ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేస్తోందన్నారు. కొడంగల్ - నారాయణ పేట ఎత్తిపోతల పనులు ప్రారంభించి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామనే భరోసా ఇచ్చి పాలమూరు కన్నీరు తుడుస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేని హర్షం వ్యక్తం చేశారు.

దమ్ము, ధైర్యం ఉంటే…

కృష్ణా జలాల్లో తెలంగాణకు చేసిన ద్రోహం పైన… పాలమూరుకు చేసిన అన్యాయంపైన కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధపడాలన్నారు.కేసీఆర్ దుర్మార్గాలను, నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీగా మేం సిద్ధమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే… మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షకులు ఎవరో ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఓటర్ల తీర్పును రెఫరెండంగా భావిద్దాం… దమ్ముంటే సవాల్ కి సిద్ధపడు కేసీఆర్ అని సవాల్ విసిరారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసి… పాలమూరును బీడు పెట్టిన నీ చరిత్ర తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#challa-vamshi-chand-reddy #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe