/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/drunk-jpg.webp)
Drunk drive: డ్రంకన్ డ్రైవ్.. ఈ విషయంలో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కఠిన చర్యలు చేపట్టినా..మందుబాబులు మాత్రం మారడం లేదు. దీంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారితో పాటు అమాయక ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఇక యువకులు డ్రంకన్ డ్రైవ్ చేస్తూ.. ప్రాణాల మీదకే తెచ్చుకొని కన్నవారికి కడు విషాదాన్నే మిగుల్చుతున్నారు.
మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం..!
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో డ్రంకన్ డ్రైవ్ కారణంగా ఓ కారు బీభత్సం సృష్టించింది. తాగిన మత్తులో యువకుడు ర్యాష్ గా డ్రైవ్ చేయడంతో కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు విద్యార్థుల్లో నుంచి ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే యువకులు డిగ్రీ చదువుతున్నారు. వీరు నలుగురు కూడా మద్యం మత్తులోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటైల్స్ తెలియాల్సి ఉంది.
చాదర్ ఘాట్ దగ్గర మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్ చల్..!
ఇక ఇలా ఉంటే.. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ రహదారి పై మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హల్ చల్ చేశాడు. చాదర్ ఘాట్ బ్రిడ్జి పై మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. పలు వాహనాలను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా కారుతో షాప్ లోకి దూసుకుపోయాడు. ఈఘటనలో ఆరుగురు వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ దివ్యాంగుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
దీంతో పాటు రెండు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి మలక్ పేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కానీ పరిధి చాదర్ ఘాట్ పీఎస్ వస్తుండంతో ఆ కేసును అక్కడికి బదిలీ చేశారు. అయితే ఈ ఘటనతో చాదర్ ఘాట్..మలక్ పేట ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.