బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించడంపై ప్రతిపక్ష నేతలు కేసీఆర్పై సెటైర్లు వేస్తున్నారు. అలాగే మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడంపైనా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు కవిత.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉన్నది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.
చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితులు మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై మీరు వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ రాజకీయ అభద్రత భావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడిపెట్టవద్దని ఆమె హితవు పలికారు.
పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. మహిళల హక్కులపై కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బీజేపీ నుంచి ఎవరో ఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను ధ్రువీకరించారని కవిత పేర్కొన్నారు.
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దొంగదీక్షలు చేశారని.. తెలంగాణలో మాత్రం మహిళలకు 6 సీట్లే కేటాయిస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇదేనా కేసీఆర్ కుటుంబానికి వచ్చే లెక్కలన్ని కవితను ఉద్దేశిస్తూ ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేసే ముందు.. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు.