Bandi: బండి సంజయ్‌ ఉద్వాసనకు కారణాలేంటి? బీజేపీ సెల్ఫ్‌ గోల్ చేసుకుందా..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ తర్వాత బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బండి స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.

Bandi: బండి సంజయ్‌ ఉద్వాసనకు కారణాలేంటి? బీజేపీ సెల్ఫ్‌ గోల్ చేసుకుందా..?
New Update

సూటి రాజకీయాల కంటే సుత్తి రాజకీయాలే మేలు చేస్తాయా..? ఏమో..ఏది మంచో..ఏది చెడో బీజేపీ హైకమాండ్‌కే తెలియాలి. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు బీజేపీకి ప్లసా..? మైనసా..? పార్టీలో నెలకొన్న అంతర్గత కొట్లాటలకు ఎండ్‌ కార్డ్‌ పడుతుందా..? కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న కిషన్‌రెడ్డి వాటికి చెక్‌ పెట్టగలరా..? అసలు బండి సంజయ్‌ని తప్పించడం వెనుక కారణాలేంటి..?

బండిని తప్పించడం కరెక్టేనా..?
కేంద్రమంత్రి పదవి ఇస్తామని.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్‌ని హైకమాండ్‌ కోరడం..ఆయన రిజైన్ చేయడం.. తర్వాత కిషన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే బండి సంజయ్‌కి పార్టీ అధిష్టానం ఇచ్చింది ప్రమోషనా..? డిమోషనా..? ఔనన్నా..కాదన్నా.. రాష్ట్రంలో పార్టీ ఛీఫ్‌గా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ గురించి ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ప్రజల మధ్యే ఉంటూ బండి సంజయ్‌ పార్టీ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు. ఆ యాత్రలని..ఈ సభలని..నిత్యం జనం మధ్యే ఉంటూ పార్టీని బలపేతం చేసేందుకు కృషి చేశారు. ప్రజల్లోకి ఎంతగా పార్టీని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారో..అంతలా వివాదాలను కొని తెచ్చుకున్నారు. ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌తో పాటు సొంతపార్టీ నేతల నుంచే వ్యతిరేతను ఎదుర్కొన్నారు. ఆ అంతర్గత పోరు కాస్త చినికి చినికి గాలి వానలా మారింది. ఆయన అధ్యక్ష పదవికే ఎసరు పెట్టింది. అటు పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన ఉద్వాసనకు ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

1) సీనియర్ల నుంచి పెరిగిన వ్యతిరేకత
2) బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా కొనసాగితే గుడ్‌బై చెబుతానని ఈటల ఢిల్లీ పెద్దలకు చెప్పడం.
3) కిషన్‌రెడ్డిని పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని సీనియర్లు పట్టుపట్టడం
4) బండి సంజయ్‌ అందరిని కలుపుకోని పోవడంలేదన్న ఫిర్యాదులు
5) బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలను బీజేపీ వైపు తీసుకురాలేకపోయారన్న విమర్శలు

publive-image బండి సంజయ్, కిషన్ రెడ్డి (ఫైల్)

అధ్యక్షుడి మార్పు బీజేపీకి మంచి చేస్తుందా..?
ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలో పార్టీ అధ్యక్ష మార్పు మంచి చేస్తుందో, చెడు చేస్తుందో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరికలు పెరుగుతున్నాయి..బీఆర్‌ఎస్‌లో అసమ్మతి స్వరం ఎక్కువగా వినిపిస్తోంది. వీటికి చెక్‌ పెట్టాలంటే ఏదో ఒకటి చేయాలి..అదే అన్నీ సమస్యలను తీర్చేవిధంగా ఉండాలి. అందుకే అధ్యక్ష మార్పు జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో కిషన్‌రెడ్డి ఈ బాధ్యతలు నిర్వహించినా..బండి సంజయ్‌ వచ్చిన తర్వాతే తెలంగాణలో బీజేపీకి మైలేజ్‌ వచ్చిందన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి పోటినిచ్చింది. ఇదంతా బండి సంజయ్‌ వల్లే జరిగిందని ఆయన అనుచరులు చెబుతుండగా..ఈటల, రఘునందన్‌ ఏ పార్టీ నుంచి పోటి చేసినా గెలుస్తారని బండి సంజయ్‌ వ్యతిరేక వర్గం వాదిస్తోంది. వీరిలో ఎవరి అభిప్రాయం కరెక్టో..ఎవరిది రాంగో తెలియాలంటే ఎన్నికలు జరిగి..వాటి ఫలితాలు వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే..! అటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు కిషన్‌రెడ్డి చెక్‌ పెట్టగలరా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే..!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe