/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jp-nadda.jpg)
భారతీయజనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అప్రమత్తమైన బీజేపీ..దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ మరింత పెంచింది. అందులోనూ తెలంగాణపై మరింత ద్రుష్టిసారించింది. పార్టీలో ఉన్న విభేదాలను తొలగించే వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
తెలంగాణ బీజేపీనేతలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. నోవాటెల్ లో దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. లీకులతోనే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని..ఇక పై అలాంటి పనులు చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించారు జేపీ నడ్డా. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ 170 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువచ్చే విధంగా ఐఖ్యత చూపించాలని నడ్డా చెప్పారని సమాచారం. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం లోపం తెరపైకి వచ్చింది. నేతలు ఓపెన్ గా మాట్లాడటం ఢిల్లీ పెద్దలకు కోపం తెప్పించింది. ఇలాంటి చర్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో బండి సంజయ్ వర్సెస్ రఘునందన్ రావు అంశం ఢిల్లీ పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి బండి సంజయ్ పై విమర్శలు చేసిన సంగతి ఢిల్లీ వరకు చేరింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలకు జేపీ నడ్డా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరు పద్ధతి మార్చుకుంటారా లేక మిమ్మల్నే మార్చమంటారా అంటూ ఫైర్ అయ్యారు. గ్రూపు రాజకీయాలు, ఈగోలు పక్కన పెట్టండంటూ హెచ్చరించారు. అందరు కలిసి కట్టుగా ఉండి పనిచేస్తే అధికారంలోకి వస్తామన్నారు. పార్టీకి నష్టం చేసేవారు ఎవరైనా సరే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి చిన్న విషయానికి మీడియాకు ఎక్కద్దంటూ వార్నింగ్ఇచ్చారు.
కిషన్ రెడ్డి నాయకత్వంలో ప్రతిఒక్కరూ కలిసి పనిచేయాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్నది అధిష్టానానికి తెలుసు. తమిళనాడులో అన్నామలై అద్భుతంగా పనిచేస్తున్నారు. అతన్ని మిగిలిన నేతలంతా ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా సపోర్టు ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావొద్దు..మీరు పోరాటాన్ని ఆపొద్దు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతే తెలంగాణలో నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తాం..బీఆర్ఎస్ ను కొట్టేది కేవలం బీజేపీమాత్రమే అంటూ చెప్పారు జేపీ నడ్డా.