బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా పలు పార్టీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకులతో నితిష్ భేటీ కొనసాగింది. తాజాగా బెంగాల్ సీఎం ఒక అడుగువేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ను కలవడానికి గురువారం ఆమె పాట్నాకు చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసంలో లాలూతో భేటీ అయ్యారు. లాలూ పాదాలకు నమస్కరించారు మమత. ఆ సమయంలో మమతతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో లాలూ ఆరోగ్యంపై మమతా ఆరా తీశారు. ఇద్దరూ నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మమతకు శాలువా కప్పి సత్కరించారు లాలూప్రసాద్ యాదవ్.
రేపు (జూన్ 23) పాట్నాలో జరగనున్న సమావేశానికి సంబంధించి, విపక్షాల సమావేశం నిర్మాణాత్మకంగా ఉంటుందని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని 'విపత్తు' నుంచి కాపాడాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అన్నారు. లాలూతో సమావేశం ముగిసిన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రేపు (జూన్ 23) జరిగే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరం కలిసి కట్టుగా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. దీనితో పాటు, ఆప్, కాంగ్రెస్ మధ్య పోరు ప్రశ్నపై, రేపు సమావేశంలో ఇవన్నీ నిర్ణయిస్తాయని మమత చెప్పారు. సమావేశంలో నిర్ణయించిన విధానం అందరికీ వర్తిస్తుందని తెలిపారు.