Vikarabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్స్టేషన్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతితో లేచిపోయిన యువకుడి ఆచూకీ కోసం అతని తల్లిని చిత్రహింసలకు గురిచేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఏ పాపం తెలియదని ఆ తల్లి నెత్తినోరు కొట్టుకున్నా వినిపించుకోకుండా కూలీ పనులకు కూడా వెళ్లకుండా మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుకుంటూ దారుణానికి పాల్పడ్డారు. చివరికి ఈ విషయం గ్రామస్థుల సమాచారంతో మీడియాకు తెలియడంతో పోలీసుల ఓవర్ యాక్షన్ బయటపడింది
తుపాకీతో కాల్చి చంపేస్తామంటూ బెదిరింపులు..
ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ కు చెందిన బాలిక (16) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి మే 2న ఇంటినుంచి వెళ్లిపోయారు. దీంతో నరేష్ పై బాలిక పేరెంట్స్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో కళావతిని ఎస్ఐ రమేశ్కుమార్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ‘నీ కొడుకు మైనర్ బాలికను తీసుకుపోయాడు. రెండు రోజుల్లో వెతికి తీసుకురా. లేదంటే నీ కొడుకును తుపాకీతో కాల్చి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కళావతి. 'కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు నిజంగా ఏమీ తెల్వదు సారూ. వాడు హైదరాబాద్ లో పనిచేసుకుంటాడు. ప్రేమ గురించి నిజంగా మాకు తెల్వదు. పిల్ల తల్లికి తెలుసు. నాకు తెల్వదు' అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ లాఠీతో దారుణంగా కొట్టాడు. చేతులు, కాళ్లు వాచిపోయి నడవడానికి కూడా రావట్లేదని కళావతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 'మూడు నెలలనుంచి రోజు పొద్దున 9 గంటలకు పోలీస్ స్టేషన్కి వస్తున్నా. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు' అంటూ కన్నీరు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీదును చంపిందెవరు?
ఈ ఘటనపై స్పందించిన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఐపై చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో తాండూరు రూరల్ సీఐ ఆశోక్ స్పందిస్తూ.. 'మైనర్ ను తీసుకెళ్లిన వ్యక్తి మైనర్ అయినా అరెస్టు చేస్తాం. విచారణ కోసం బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్కు పిలిచారు. ఆమెను కొట్టినట్లు మా దృష్టికి రాలేదు. విచారణ అనంతరం బాధితులపై యాక్షన్ తీసుకుంటాం' అని చెప్పారు.