తెలంగాణ ఎన్నికల (Telangana Elections) వేళ ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే.. మరో వైపు టికెట్ల లొల్లి సాగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) ఈ వివాదాలన్ని ఇప్పటికే చల్లారగా.. కాంగ్రెస్, బీజేపీలో (BJP) మాత్రం ఇప్పుడే తారా స్థాయికి చేరాయి. తాజాగా బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇన్నాళ్లుగా అక్కడ ఇన్చార్జిగా పని చేసిన కాసుల బాలరాజ్ (Kasula Balaraj) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయనను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి వచ్చి కాసుల బాలరాజ్ ను పరామర్శించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను నిజామాబాద్ కు అంబులెన్స్ లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BREAKING: కేసీఆర్ కు తప్పిన ప్రమాదం!
ఇదిలా ఉంటే.. బాన్సువాడ టికెట్ ను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఇందుకు కొద్ది రోజుల ముందే ఆయన బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను కాదని.. ఆఖరి నిమిషంలో వచ్చిన రవీందర్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ బాలరాజ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఓ దశలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతారన్న ప్రచారం కూడా సాగింది.
టికెట్ పై హైకమాండ్ ఆలోచన మారకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా బాలరాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్త కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాశంమైంది. దీంతో అధిష్టానం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.