Bandi Sanjay: టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను హఠాత్తుగా తప్పించిన బీజేపీ అధిష్టానం ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోవాలని డిసైడ్ అయింది. ముందుగా ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసిన హైకమాండ్.. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆయన సేవలను మరింతా విస్తారంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఆయనకు త్వరలోనే నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించబోతున్నట్టు సమాచారం.
ఏపీతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, గోవా ఈ నాలుగు రాష్ట్రాల బాధ్యతలను హైకమాండ్ ఆయనకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రాష్ట్రాల్లో ఆయన ఓటర్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ఇంచార్జ్ గా పని చేయనున్నారు. దీంతో పాటు ముంబై యూనిట్ రెస్పాన్సిబులిటీని కూడా ఆయనకే ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో హిందుత్వ ఎంజెడాను తీసుకొని వెళ్లడానికి..!
మరోసారి ఎలాగైనా దేశంలో పగ్గాలు చేపట్టాలని గట్టిగా డిసైడ్ అయిన కమలనాథులు కర్ణాటక ఓటమితో రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల కోసం పాఠాలను నేర్చుకున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ఓటర్లను ఖాతాలోకి వేసుకోవడానికి ఓటర్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ లను చేపడుతున్నారు. దీని కోసం దమ్మున్న నేతలను ఇన్ ఛార్జులను గా నియమిస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ను నాలుగు రాష్ట్రాలకు ఓటర్ ఎన్ రోల్ మెంట్ ఇన్ చార్జ్ గా నియమించనుంది హైకమాండ్. అయితే వీరు బూత్ ల వారీగా బీజేపీకి మద్దతు తెలిపే వారు ఎవరు.. వారి ఓట్లు లిస్టులో ఉన్నాయా.. అనే దానిపై వర్కౌట్ చేస్తారు. ఇక మహారాష్ట్రలో హిందుత్వ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి హిందుత్వ ఎజెండాను స్ట్రాంగ్ గా ప్రజల్లోకి తీసుకొని వెళ్లే సత్తా ఉన్న బండి సంజయ్ ను పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఇక ఈ విషయంలో తెలంగాణకు రేఖా వర్మ రానున్నారు. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర కో ఇన్ చార్జ్ గా ఉన్నారు.
ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న బండి..!
ఏపీలోను దూకుడును పెంచాలని భావిస్తున్న అధిష్టానం బండిని రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలో ఈ నెల 21 న ఏపీలోని ముఖ్య నేతలతో బండి సంజయ్ భేటీ కానున్నారు. అక్కడి కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. కార్యకర్తలకు ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను పార్టీ వైపు ఎలా ఆకర్షించాలనే దానిపై బండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అంతే కాదు తెలంగాణలో త్వరలో పార్టీ చేపట్టబోయే రథయాత్రలోను బండి కనిపించనున్నారు. మొత్తానికి బండి సేవలను పలు రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని హైకమాండ్ ఫిక్స్ అయింది. పార్టీని కొన్ని రాష్ట్రాల్లో స్ట్రాంగ్ చేయడానికి బండి లాంటి రెబల్ నాయకుడి అవసరం చాలా ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.