/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/balayya-jpg.webp)
Balakrishna: టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ దీనిపై స్పందించారు. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటకు వేటే అని బాలయ్య ఘాటు స్వరంతో వైసీపీ నేతలను హెచ్చరించారు. అక్రమ కేసులకు భయపడాల్సింది తాము కాదని.. వైసీపీ నేతలే అన్నారు. టీడీపీ బలహీనపడుతుంది అని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇంకా బలపడుతున్నామన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా ఈ యుద్ధంలో కలవటం శుభపరిణామం..
మళ్లీ చెబుతున్నా.. ఏపీ ప్రజల కోసం యుద్ధం చేస్తాం.. పవన్ కళ్యాణ్ కూడా ఈ యుద్ధంలో కలవటం శుభపరిణామమని బాలయ్య తెలిపారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వాడు దేవుడికి కూడా భయపడడన్నారు. తప్పు చేసిన వారంతా బయట ఉంటే రాష్ట్రం బాగు కోసం పనిచేసిన చంద్రబాబు జైలులో ఉన్నారని పేర్కొ్న్నారు. తాము భయపడే రకం కాదని.. న్యాయపరంగానే అన్నీ ఎదుర్కొంటామని వెల్లడించారు. జగన్ ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని బాలయ్య విమర్శలు చేశారు.
చంద్రబాబు జైల్లో ఉన్నా సింహంలా ధైర్యంగా ఉన్నారు..
మరోవైపు లోకేష్ వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నా సింహంలానే ధైర్యంగా ఉన్నారని జగన్కే నిద్ర పట్టడం లేదన్నారు. చంద్రబాబు కట్టిన జైలులోనే ఆయన్ని కట్టేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుదేశం-జనసేన కార్యకర్తలతో పాటు తనపై, పవన్ కల్యాణ్పై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారన్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఏపీ చరిత్రలోనే కీలక నిర్ణయమన్నారు. ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించామని.. టీడీపీ, జనసేన కలిసి యుద్ధానికి సిద్ధమవుతాయని తెలిపారు. జగన్ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. ఏ ఒక్క దానిపై కేసు నమోదు కాలేదన్నారు. అసలు ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. జగన్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని లోకేష్ హెచ్చరించారు.
టీడీపీ-జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించిన పవన్..
అంతకుముందు రాజమండ్రి జైలులో పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. రేపటి నుంచి టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.