సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్..
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్ రెడీ అవుతోంది. వన్డే ప్రపంచకప్ ముందు జరగనున్న ఆసియా కప్ షెడ్యూల్ను తాజాగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆగష్టు 30న మొదలుకానున్న ఆసియా కప్ టోర్నీ.. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. అయితే ఈసారి ఆసియా కప్.. పాకిస్థాన్, శ్రీలంక దేశాల వేదికగా జరగనుంది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్తో టోర్నీ మొదలుకానుంది. కొలంబోలో ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా అలరించనుంది. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో ఇండియా తలపడనుంది.
I am happy to announce the schedule for the highly anticipated Men’s ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let’s join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
2 గ్రూపులు.. 6 జట్లు.. 13 మ్యాచులు..
మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇండియా, పాకిస్థాన్, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, శ్రీలంకలు గ్రూప్-బిలో ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4 మ్యాచులు సెప్టెంబర్ 6నుంచి 15వరకు జరగనున్నాయి. మొత్తం 13 మ్యాచ్ల్లో భాగంగా శ్రీలంకలో 9, పాకిస్థాన్లో 4 మ్యాచ్లు జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వన్డే ప్రపంచ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్ టోర్నీ వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
కరేబీయన్ గడ్డపై రోహిత్ సేన..
ప్రస్తుతం టీమిండియా.. వెస్టిండీస్ గడ్డపై పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్ట్ల సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లోనే ఇన్నింగ్స్ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఇదే ఊపుతో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని యోచిస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ మొదలుకానుంది. అలాగే ఈనెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభమవుతుంది. బార్బడోస్ వేదికగా మొదటి, రెండు వన్డే మ్యాచులు .. మూడో మ్యాచ్ త్రినిడాడ్లో జరగనుంది. ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.