గుజరాత్, యూపీలో ముస్లింలనే లక్ష్యం చేసుకుని బీజేపీ దాడులు చేయిస్తుందంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేరకు గుజరాత్ లోని జునాగఢ్, బులంద్ షహర్ లకు సంబంధించిన రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం వర్గానికి చెందిన పలువురు యువకులను కొట్టారంటూ ఆరోపించారు.
ఓవైసీ విడుదల చేసిన మొదటి వీడియోలో, దర్గా జునాగఢ్ వెలుపల వరుసలో నిలబడి కొట్టుకుంటున్న గుంపును చూడవచ్చు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని, క్యూలో నిలబడిన వ్యక్తులను కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. గుజరాత్లోని జునాగఢ్లో ముస్లిం యువకులు దర్గా కూల్చివేతపై నిరసన వ్యక్తం చేయడంతో.. పోలీసులు అదే దర్గా ముందు ముస్లిం యువకులను కొడుతున్నారంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
ఓవైసీ విడుదల చేసిన రెండవ వీడియోలో బులంద్షహర్లో, ఒక రోజువారీ కూలీని చెట్టుకు కట్టేసి, గుండు గీయించి బలవంతంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించినట్లు ఉంది. ఆ తరువాత, దోషులపై చర్యలు తీసుకోకుండా పోలీసుల సానుభూతి చూడండి. సాహిల్ ను జైలుకు పంపారు. ఆయనపై జరుగుతున్న అణచివేతపై ఫిర్యాదు చేస్తే ఎక్కడికి వెళ్లాలి అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.