NDA Meet Delhi: ఏపీనాట రక్తి కట్టిస్తోన్న ట్రయాంగిల్‌ లవ్‌..! ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవకపోవడంలో అంతర్యమేంటి..?

ఎన్డీయే మిత్రపక్ష సమావేశానికి జనసేనను మాత్రమే బీజేపీ ఆహ్వానించడంపై వివిధ రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీని బీజేపీతో దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని.. కానీ కమలం పార్టీ నుంచే ఇప్పటివరకు ఎలాంటి కన్‌ఫర్‌మేషన్‌ లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

New Update
NDA Meet Delhi: ఏపీనాట రక్తి కట్టిస్తోన్న ట్రయాంగిల్‌ లవ్‌..! ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవకపోవడంలో అంతర్యమేంటి..?

ఓవైపు 2014 విన్నింగ్‌ స్టోరీని రిపీట్‌ చేయాలని పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) భావిస్తుంటే..మరోవైపు బీజేపీ మాత్రం చంద్రబాబు(Chandrababu) లేకుండానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందా..? 2014ఎన్నికలకు చంద్రబాబు ఎన్డీయే(NDA)లోనే భాగంగా ఉన్నారు..నాలుగేళ్ల తర్వాత కూటమి నుంచి బయటకొచ్చి యూపీఏతో జతకట్టారు..ఇప్పుడు మళ్లీ బీజేపీ-జనసేనతో కలిసి పని చేయాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు బలాన్ని చేకూర్చేలా చంద్రబాబు గతంలోనే అమిత్‌షా(Amitshah)తో భేటీ కూడా అయ్యారు. ప్రచారాల్లో, మీటింగ్‌ల్లో బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడంలేదు..ఇలా ఈ మూడు పార్టీలు కలిసే పోటి చేస్తాయన్న సంకేతాలు జనాల వరకు వెళ్లాయి కానీ..ఇప్పటివరకు ఇటు టీడీపీ నుంచి కానీ.. అటు బీజేపీ-జనసేన నుంచి ఓ క్లారిటీ అయితే రాలేదు. ఇదే సమయంలో జరిగిన ఎన్డీయే మిత్రపక్ష మీటింగ్‌కు జనసేన(Janasena) అధినేత హాజరవుతుండగా..అసలు టీడీపీ(TDP)కే పిలుపే రాకపోవడం ఆ పార్టీ క్యాడర్‌ని సైతం కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇంతకి ఏపీ(AP)లో ఏం జరుగుతోంది..? ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవకపోవడంలో అంతర్యమేంటి..?

publive-image చంద్రబాబు(ఫైల్), పవన్(ఫైల్), మోదీ(ఫైల్)

పొత్తు పొడిచేనా?
ఏపీలో జరుగుతున్న పరిణామాలు అల్లుఅర్జున్‌ నటించిన 'ఆర్య' సినిమాని తలపిస్తున్నాయి. అందులో అజయ్‌, గీతా ఒకరినొకరు ప్రేమించుకుంటుంటారు..అది కూడా అజయ్‌ చచ్చిపోతానని కాలేజీ బిల్డింగ్‌ ఎక్కడంతో గీతా అతని లవ్‌కి యస్‌ చెబుతుంది..మరోవైపు ఆర్య మాత్రం తన లవ్‌ని ఫీల్‌ అయితే చాలు అంటూ గీత వెంట తిరుగుతుంటాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పేరుకు పొత్తులో ఉన్న మాటే కానీ అధికారికంగా జనసేన-బీజేపీ కలిసి ఇప్పటివరకు అడుగులు వేసింది లేదు. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే బీజేపీ పెద్దలను కలిశారని టాక్‌. అయితే ఇప్పటివరకు బీజేపీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా చంద్రబాబు తనతో పొత్తును ఫీల్‌ అవ్వమని అడగుతున్నా కానీ బీజేపీ మాత్రం పవన్‌తోనే అడుగులువేయాలని నిర్ణయించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదంతా టీడీపీ-బీజేపీ గేమ్‌ప్లాన్‌లో భాగమని.. చంద్రబాబు-అమిత్‌షాని అంత తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు వాదిస్తున్నారు.

ఇంతకు ఎందుకు పిలవలేదు సారూ?
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతుయని..ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్న సమయంలో ఎన్డీయే మిత్రపక్ష పార్టీలను ఆహ్వానించి మీటింగ్‌ పెడుతుంది. అది యూపీఏ మిత్రపక్షాలు భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ మీటింగ్‌ పెట్టడం పొలిటికల్‌ హీట్‌ని రాజేసింది. ఈ మీటింగ్‌కి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేన మాత్రమే హాజరవుతుంది. ఏపీలో బీజేపీతో పవన్‌ పొత్తులోనే ఉండగా.. అటు టీడీపీ మాత్రం ఇప్పటివరకు ఏ గూటికి వెళ్తుందన్నది డిసైడ్ కాలేదు. ఒంటరిగా చేస్తుందన్నదానిపై కూడా క్లారిటీ లేదు. జగన్‌ని ఓడించేందుకు ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. అంటే సీఎం పదవిని కూడా వదులుకుంటానికి రెడీగా ఉన్నట్టు చంద్రబాబు పరోక్షంగా చెప్పాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే పరోక్షంగా పవన్‌ కోసం ఈ పని చేస్తానని ఆయన చెప్పినట్టు భావిస్తున్నారు. ఇదంతా ప్రచారం మాత్రమే..వీటిలో నిజనిజాలు ఏంటన్నది ఆ పార్టీ నేతలు చెబితే కానీ కచ్చితంగా నిర్ధారణకు రాలేం. ఇటు పవన్‌ సైతం టీడీపీని బీజేపీకి దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ కమలం పార్టీ నుంచే ఇప్పటివరకు ఎలాంటి కన్‌ఫర్‌మేషన్‌ లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ తర్వాత ఎలా మారుతాయో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు