టీడీపీలో (TDP) ఉండి నియోజకవర్గ టికెట్ వివాదం ఇంకా ముగియలేదు. ఈ రోజు ఉండి నేతలతో చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆయనకు ఇస్తేనే కలిసి పని చేస్తామని.. టికెట్ వేరే వారికి ఇస్తే సహించబోం అని తేల్చిచెప్పారు. ఐదేళ్లపాటు పార్టీ కోసం పనిచేశామని, బాబు మాతో మాట్లాడాలని కార్యకర్తల నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నానన్నారు. బాబు ప్రకటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి: YS Sharmila : వివేకాను చంపింది అవినాష్.. హంతకులకు రక్షగా జగన్ : పులివెందులలో షర్మిల సంచలన కామెంట్స్
ఈ నేపథ్యంలో రామరాజు టికెట్ మార్పు ఉండదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. రఘురామకే చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉండి టికెట్ ను చంద్రబాబు తొలుత రామరాజుకు కేటాయించారు. అయితే.. ఇటీవల రఘురామకృష్ణంరాజు పార్టీలో చేరనప్పటి నుంచి టికెట్ మార్పుపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
రామరాజు స్థానంలో రఘురామను ఉండి నుంచి బరిలోకి దించుతారన్న చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే రామరాజు తన అనుచరుల వద్ద కన్నీళ్లు కూడా పెట్టుకోవడంతో.. ఈ మేరకు ఆయనకు కూడా సమాచారం అందిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. టికెట్ మారుస్తారా? ఒక వేళ మారిస్తే.. రామరాజు నిర్ణయం ఎలా ఉంటుంది? అన్న అంశంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.