Alapati Rajendra Prasad: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే సభలు సమావేశాలతో దూసుకుపోతున్నారు. అయితే.. తాజాగా టీడీపీకి గుంటూరులో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీకి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.
ALSO READ: ఎమ్మెల్యే దానంకు షాక్.. హైకోర్టు నోటీసులు
పొత్తుల రచ్చ..
రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు.. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. పొత్తులతో ఎన్నికల పోటీ లోకి దిగుతున్న టీడీపీ కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సీట్లు జనసేనకు, బీజేపీ కేటాయించింది. పొత్తు కారణంగా కొందరు టీడీపీ నేతలకు టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో టికెట్ రాలేదని భంగపడ్డ కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరిని బుజ్జగించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం. భంగపడ్డ నేతలకు ఎమ్మెల్సీ పదవుల హామీ, ఇతర హామీలు ఇస్తూ వారిని బుజ్జగిస్తున్నారు చంద్రబాబు.
తెనాలి టికెట్ కోసమే..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఆశించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. పొత్తులో భాగంగా ఆ టికెట్ కు జనసేనకు కేటాయించారు చంద్రబాబు. తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. గుంటూరు లో టీడీపీకి కీలక నేతగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ క్రమంలో ఈరోజు తన అనుచరులతో భేటీ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన ముఖ్య అనుచరులతో భేటీ అయినట్లు సమాచారం. తదుపరి కార్యాచరణపై వారథి భేటీ అయినట్లు తెలుస్తోంది. మరి ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారా? లేదా పార్టీలోనే ఉండి జనసేన అభ్యర్థి గెలుపు కృషి చేస్తారా? అనేది వేచి చూడాలి.