Nara Lokesh IRR Case Details: లోకేష్ చేయించిన ఆ ఒక్క మార్పుతో లింగమనేనికి రూ.700 కోట్లు.. హెరిటేజ్ కూ లబ్ధి: సీఐడీ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో నారా లోకేష్ చక్రం తిప్పారని ఏసీ సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో లింగమనేని భూముల ధరలు రూ.700 కోట్లు పెరిగాయని చెబుతోంది. ఇంకా నాటి మంత్రి నారయణతో పాటు హెరిటేజ్ సంస్థకు కూడా ప్రయోజనం చేకూరిందని చెబుతోంది.

New Update
Nara Lokesh IRR Case Details: లోకేష్ చేయించిన ఆ ఒక్క మార్పుతో లింగమనేనికి రూ.700 కోట్లు.. హెరిటేజ్ కూ లబ్ధి: సీఐడీ

నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో ఏపీ సీఐడీ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ పై ఐసీసీ సెక్షన్‌ 120(బీ), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్లతో పాటు వినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2), 13(1)(సీ), 13(1)(డీ) కింద కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, లింగమనేని రమేష్ ఏ4గా ఉన్నారు. నారా లోకేష్ ను ఈ కేసులో ఏ14గా చేర్చింది సీఐడీ. ఈ నేపథ్యంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటి? దాంట్లో లోకేష్‌ పాత్ర ఏంటని సీఐడీ చెబుతోంది? తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Big Breaking: నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు.. ఈ నెల 4న అరెస్ట్?

ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా 97KM మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. అనంతరం.. 2015 జూలై 22న ఒక సారి, 2017 ఏప్రిల్‌ 4న మరో సారి, 2018 అక్టోబరు 31 మూడో సారి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. క్విడ్ ప్రో కోలో భాగంగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారి భూముల ధర పెరిగేందుకే ఈ మార్పులు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. మార్చిన అలైన్మెంట్ కు సమీపంలో లింగమనేని రమేశ్ కు 355 ఎకరాలు, చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ కు 13 ఎకరాల భూమి ఉంది. నారా లోకేష్ కు హెరిటేజ్ ఫుడ్స్ లో పది శాతం వాటా.. 23,66,440 షేర్లు ఉన్నాయి. అలైన్‌మెంట్ ను చేంజ్ చేసిన అనంతరం ఒక్క లింగమనేని రమేష్ భూముల విలువ రూ.177 కోట్ల నుంచి రూ.877 కోట్లకు పెరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Cash For Vote Case: చంద్రబాబుకు ఊహించని షాక్.. తెరపైకి ఓటుకు నోటు కేసు..

అమరావతి రాజధాని నిర్మాణం కంప్లీట్ అయితే.. ఆ ధర రూ.2,130 కోట్లకు చేరుతుందని సీఐడీ చెబుతోంది. అలైన్మెంట్ కు ఆనుకునే లింగమనేనికి 168.45 ఎకరాల భూమి ఉందని సీఐడీ చెబుతోంది. ఇంకా ఐఆర్ఆర్ కు సమీపంలోని మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల భూముల ధరలు కూడా భారీగా పెరిగాయన్నది సీఐడీ ఆరోపణ. రోడ్డు నిర్మాణంతో సంబంధం లేకుండానే అలైన్మెంట్ మార్పు ద్వారానే వీరంతా భూముల ధరలను పెంచుకున్నట్లు సీఐడీ చెబుతోంది. ఈ అలైన్మెంట్ మార్పులో నాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణతో పాటు లోకేష్ జోక్యం ఉందని.. వారి భూముల ధరలు పెంచుకుని భారీగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారన్నది సీఐడీ వాదన. వీరి భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా.. అలైన్మెంట్ ను 97.50 కి.మీ మార్చారన్నది ఏపీ సీఐడీ వాదన. ఇంకా ఈ అలైన్మెంట్ గురించి ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు, చంద్రబాబు సన్నిహితులు భారీగా లబ్ధిపొందారని సీఐడీ ఆరోపిస్తోంది.

ఇంకా లోకేష్ పాత్ర విషయానికి వస్తే.. అమరావతిలో లింగమనేని ఫ్యామిలీ ల్యాండ్స్‌ను నుంచి హెరిటేజ్‌ సంస్థకు బదలాయించడంలో నారా లోకేష్ చక్రం తిప్పారని సీఐడీ అధికారుల ఆరోపణ. హెరిటేజ్‌ సంస్థకు లింగమనేని ఫ్యామిలీ భూములు అమ్మినట్లుగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు లేవని సీఐడీ చెబుతోంది. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో లబ్ధిపొందిన లింగమనేని రమేష్‌ కరకట్ట ఇంటిని నాటి సీఎం చంద్రబాబుకు ఇచ్చారని చెబుతోంది ఏపీ సీఐడీ. సీఎంగా ఉన్న నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు అదే ఇంటిలో ఉంటున్నారు. ఆ ఇంటి గురించి లింగమనేని రమేష్‌ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు, ట్రాన్సాక్షన్లు నడపకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది సీఐడీ. చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు మాత్రం లింగమనేని తన కరకట్ట నివాసాన్ని నాటి ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారని చెబుతున్నారు.

లోకేష్ ఏపీ ప్రభుత్వ మంత్రివర్గంలో చేరిన అనంతరం చంద్రబాబుతో కలిసి ఈ కరకట్ట నివాసంలోనే ఉన్నారు. ఈ క్రమంలో లింగమనేనికి భారీగా లబ్ధి చేకూర్చి ఆయన కుటుంబం నుంచి తమ హెరిటేజ్‌ సంస్థకు భూములతో పాటు, కరకట్ట నివాసాన్ని దక్కించుకోవడంలో లోకేష్ చక్రం తిప్పారని ఆరోపిస్తోంది ఏపీ సీఐడీ.

Advertisment
తాజా కథనాలు