/rtv/media/media_files/2025/02/22/6M2tAF4BqxytxnT4sJUR.jpg)
ఏపీ మాజీ సీఎం జగన్, వైసీపీ అధినేత జగన్ మనస్సు మార్చుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీకి హాజరుకానున్నారు. గతంలో ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లినా సరైన గౌరవం ఇచ్చే పరిస్థితి లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. అసెంబ్లీకి రాకపోతే జగన్ పై అనర్హత వేటు పడుతుందని కూడా కామెంట్లు చేశారు.
వైఎస్ జగన్ చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం అసెంబ్లీకి రాకపోవడంప తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు అసెంబ్లీ రావడానికి మొహం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే దమ్ము లేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో జగన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరై అధికార పక్షాన్ని ప్రజల సమస్యలపై ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాలకు హాజరై కూటమి ఎన్నికల ప్రధాన హామీలపై సూపర్ 6కి కేటాయించిన నిధులు, అమలు తీరుపై ప్రశ్నించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది వైసీపీ అధినేత వ్యూహమన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.
కేవలం గవర్నర్ ప్రసంగానికే పరిమితమా?
అయితే జగన్ అసెంబ్లీకి హాజరు కావాలని తీసుకున్న నిర్ణయంపై మరో ఆసక్తికర చర్చ సైతం సాగుతోంది. గవర్నర్ ప్రసంగం వరకు హాజరై తర్వాత మళ్లీ అసెంబ్లీకి దూరం ఉండే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా అసెంబ్లీకి 60 రోజులు వరుసగా గైర్హాజరైతే వేటు పడుతుందని పలు మార్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరైతే ఆ సమస్య ఉండదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. మరో వైపు గవర్నర్ కు తాము గౌరవం ఇచ్చినట్లు కూడా ఉంటుందన్నది వైసీపీ అధినేత వ్యూహమన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.