రూ.100 లోపే మద్యం.. వరద బాధితులకు భారీగా సాయం.. కేబినెట్ కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేవలం రూ.100లోపు ధర నుంచే మద్యం అందుబాటులోకి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ప్రకటించింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.100లోపు ధరకే నాణ్యమైన మద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం విమానాశ్రయానికి పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్ పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టడానికి కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై సీఎం చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. తదుపరి కేబినెట్ లో వాలంటీర్ల అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. 

వరద బాధితులకు అండగా..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు నీటమునిగాయి. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకు నష్టపరిహారం అందించేందుకు వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ వరదల్లో మునిగిపోయి, ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందించనున్నట్లు నిన్న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ కాకుండా, వరదల వల్ల ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇస్తాం. గతంలో కేవలం రూ.2 వేలు ఇచ్చే వారు, ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని సీఎం ప్రకటించారు.

హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం. హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం. హెక్టార్‌ చెరకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు. హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు, హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి నేడు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా.. పంట నష్ట పరిహారం కౌలు రైతులకే ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది.

మహిళలకు సీఎం కానుక..

వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా? అనే అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు తీసుకున్నారు. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపినట్లు సమాచారం.

టార్గెట్ సాక్షి..

గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపై కెబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సీఎం దృష్టికి తెచ్చారు. నిబంధనలకు విరుద్దంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. సాక్షి పత్రిక సర్కులేషన్ ఎంతుంది?, ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దాని పైనా ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు సీఎంను కోరినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన…

గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు