AP News: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. ఆ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ.. మరణాలకు కారణం అదేనా?

ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

New Update
AP Health Emergency

ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో రెండు నెలలుగా భారీగా మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సీఎం చంద్రబాబునాయుడు నేడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. వారికి అత్యవసర చికిత్స అందించాలని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపించామని సీఎంకు వివరించారు. 72 గంటల్లో రిపోర్టులు వస్తాయన్నారు. గ్రామంలో ఎక్కువ మంది పశుపోషణ పై ఆధారపడతారన్నారు.

దీంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. తురకపాలెం గ్రామంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయన్నారు. ఇంకా అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందన్నారు. స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని చెప్పారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయన్నారు.

యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సీఎంకు వివరించారు. ఈ ఆరోగ్య సమస్యలపై మైక్రోబయాలజీ నిపుణులు సైతం పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ తో పాటు కేంద్ర వైద్య బృందాలు రప్పించాలన్నారు. అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు