Andhra Pradesh: సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ.. తుపాను నష్టంపై చర్చ..

తుపాను కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ అయ్యింది. తుపాను నష్టంపై చర్చించింది. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి సాయం అందేలా చేస్తామంది.

New Update
Andhra Pradesh: సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ.. తుపాను నష్టంపై చర్చ..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌తో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను సీఎంతో కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు.

ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం తెలిపింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయంది. ఏపీలో అమలవుతున్న ఈ- క్రాపింగ్‌ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని కేంద్ర బృందం తెలిపింది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు అధికారులు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు చెబుతామన్నారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు బృందం అధికారులు.

రైతుల సమస్యలు తెలుసుకున్నాం..

తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు వివరించారు కేంద్ర బృందం అధికారులు. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని, మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామని కేంద్ర బృందం వివరించింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించామన్న సభ్యులు వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం తెలిపింది. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చ జరిగింది. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని, అలాగే ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామన్న కేంద్ర బృందం ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీకూడా తాము స్వయంగా చూశామని, ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వెల్లడించింది. కౌలు రైతులకు కూడా ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయమని,కేంద్ర బృందం తెలిపింది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సూచించింది. పెసలు, మినుములు, మిల్లెట్స్‌ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఉపాధిహామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైనా కేంద్ర బృందానికి రాష్ట్రాధికారులు వివరాలు తెలిపారు. పెండింగులో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరారు. తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు.

పారదర్శకత వ్యవస్థ..

తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి వివరించారు సీఎం జగన్‌. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామన్నారు. మిచౌంగ్ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలకు కారణమైందని వివరించారు. ఈ కారణంగా పంటలు దెబ్బతిన్నాయని సీఎం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని అధికారులకు తెలిపారు సీఎం. తమ రాష్ట్రంలో ఈ- క్రాపింగ్‌ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం పెడతామని తెలిపారు ముఖ్యమంత్రి. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులను ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. దీంతో రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా లబ్ది చేకూరుతుందన్నారు.

Also Read:

నళినికి మళ్లీ డీఎస్పీ పోస్టింగ్? సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

500కే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..

Advertisment
తాజా కథనాలు