పాలకులారా? మమ్మల్ని పట్టించుకోండి: అడవి బిడ్డల వినూత్న నిరసన

ఎన్నికలొచ్చినప్పుడు తప్ప నేతలు తమను పట్టించుకోవటం లేదన్న ఆవేదన అక్కడి గిరిపుత్రులలో ఉంది. అందుకే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లాలని వారు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 4 కి.మీ మేర ఆదివాసీల డోలీయాత్ర నిర్వహించారు.

New Update
పాలకులారా? మమ్మల్ని పట్టించుకోండి: అడవి బిడ్డల వినూత్న నిరసన

అనకాపల్లి జిల్లా రోలుగుంట.. ఇక్కడ ఉండే ఆదివాసీలు పెద్దగా చదువుకోలేదు. లౌకిక విషయాలపైన వారికి పెద్దగా అవగాహన లేకపోయినా తమ సమస్యలను తామే చక్కదిద్దుకోవాలన్న స్పృహ ఉంది. ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఇక్కడ ఉన్న ఐదుగ్రామాల ప్రజలు వినూత్నంగా నిరసనకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 4 కి.మీ మేర ఆదివాసీల డోలీయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.

తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, నీలబంధ గ్రామానికి విద్యుత్‌ సరఫరా సౌకర్యం కల్పించాలంటూ ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సోమవారం గిరిజనులంతా రోడ్డెక్కారు. రోలుగుంట మండలం అర్ల పంచాయితీ నీలబంధ గ్రామం నుంచి ప్రారంభించి పితూరి గెడ్డ, పెద్దగరువు గ్రామాల మీదుగా జాజులబంద వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర డోలి యాత్ర సాగింది. అర్ల నుంచి పెద్దగరువు, పితూరిగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ప్రాంతంలో ఎస్టీ, కోందు తెగకు చెందిన సుమారు 300 మంది ఆదివాసీ గిరిజనులు కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి రూ.10వేల చొప్పున చందాలు పోగు చేసుకుని రూ.7లక్షల సొంత నిధులతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. అదే విధంగా జ్వరాల బారిన పడితే కి.మీ మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. ‘పాలకులరా ..ఎన్నాళ్లీ డోలీ మోతలు.. మా సమస్యలు పట్టించుకోండి?" అని వారు నేతలను వేడుకున్నారు. ఇటీవల కుంబర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా అనే మహిళ అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో అడవితల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఇలాంటి మరణాలు ఈ ప్రాంతంలో సహజం. దీంతో భారీ సంఖ్యలో గిరిజనులు చేరుకుని అంటూ నినాదాలు చేశారు.

Advertisment
తాజా కథనాలు