ఏ పార్టీ తరపున పోటీచేయడం లేదు..
తాను ఏ రాజకీయా పార్టీలో లేనని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను రాయుడు పరిశీలించారు. అక్షయపాత్ర విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం అభినందనీయమని తెలిపారు. దేశవ్యాప్తంగా 67 అక్షయపాత్ర వంటశాలలు ఉండటం గొప్ప విషయమన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 22 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న ఇక్కడి నుంచే భోజనం అందజేస్తున్నందుకు అక్షయపాత్రకు ధన్యవాదాలు తెలిపారు. సొంత రాష్ట్రానికి సేవల చేయాలనే ఉద్దేశంతోనే క్రికెట్కు గుడ్ బై చెప్పానన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా సమాజానికి సేవ చేయడంపైనే ఉందని.. అందులో భాగంగానే అక్షయపాత్ర లాంటి సంస్థలను కలుస్తానని పేర్కొన్నారు.
ఐపీఎల్ జట్టు కోసం కృషి చేస్తా..
రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని.. ఐపీఎల్లో ఏపీ జట్టు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే క్రికెట్ అకాడమీలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని రాయుడు వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రాయుడు.. ఇటీవలే ఐపీఎల్కూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లా ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విరాళం అందజేశారు. పాఠశాలలో సౌకర్యాల ఏర్పాటుకు ఆ నిధులను వినియోగించాలని సూచించారు. పాఠశాలకు పూర్వ వైభవాన్ని చేకూర్చుతానని హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది రాయుడిని ఘనంగా సత్కరించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్..
వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు పరోక్షంగా స్పందించడం ఆసక్తి రేపింది. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లడం సహజమేనని.. అలాంటివారి మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్కు కౌంటర్ ఇచ్చారు. తాను చూసినంత వరకు ప్రభుత్వంపై ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకత లేదని వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆయన కచ్చితంగా వైసీపీ నుంచి పోటీకి సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
[vuukle]