ఢిల్లీ చేరిన 'బ్రో' మూవీ రగడ.. మంత్రి అంబటి వర్సెస్ పవన్

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారు.

New Update
ఢిల్లీ చేరిన 'బ్రో' మూవీ రగడ.. మంత్రి అంబటి వర్సెస్ పవన్

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. బ్రో సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం నడుస్తోంది. సంక్రాంతికి మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్‌ను నటుడు పృథ్వీ చేత అచ్చం అలానే వేయించారని విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్, ఆ సినిమా ప్రొడ్యుసర్లపై ఘాటు విమర్శలు చేశారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేయనున్నారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్రమంత్రి షెకావత్ లను కలిశారు.

అనంతరం పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. మంత్రి ఆంబోతు రాంబాబు బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారని.. ఆయనకెందుకు సినిమాల గురించి అన్న బాబు సెటైర్లుపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బాబు జీవితమంతా ఆంబోతులకు ఆవులను సప్లే చేయడమే అంటూ మండిపడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రిగా తాను బ్రో సినిమా గురించి మాట్లాడటాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, కానీ పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భారాన్ని కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదు? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాటేమిటి? అని ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు.

పవన్ కల్యాణ్ ఎన్నో సినిమాలు చేశారని, వాటి గురించి తాను ఎప్పుడైనా మాట్లాడానా? అని ప్రశ్నించారు. కానీ బ్రో సినిమాలో తనపై విమర్శలు చేశారు కాబట్టి మాట్లాడవలసి వచ్చిందన్నారు. నీతి, నిజాయతీకి మారుపేరు అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. బ్రో సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం నిజాయతీ అంటూ ఊగిపోయే పవన్.. తాను మాత్రం నిజాయతీగా ఉండరన్నారు. బ్రోకు ఎంత తీసుకున్నారో ఎందుకు చెప్పడం లేదని.. ఇందులోని రహస్యం ఏమిటి.. ఏమిటా మతలబు? అని అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబు తన హయాంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టును అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. దివంగత నాయకులు ఎన్టీఆర్, వైఎస్ మాత్రమే రాయలసీమకు న్యాయం చేశారన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీరు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలవరం నా బిడ్డ అని చంద్రబాబు అంటారని, ఏమైనా ఆ ప్రాజెక్టును కన్నావా? విమర్శించారు. బ్రో సినిమాకు సంబంధించి పవన్‌ను తాను విమర్శిస్తే చంద్రబాబుకు నొప్పి కలుగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబూ! నీకెందుకయా బ్రో సినిమా గురించి.. నన్ను పవన్ గోకాడు కాబట్టి స్పందించానని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారన్నారు.

జనసేన పార్టీ నాయకులు రాజకీయాలు మానుకొని, సినిమాలు చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంబరాల రాంబాబు.. సందులో సంబరాల శ్యాంబాబు అలియాస్ రాంబాబు.. ఏ సినిమా అయినా తీసుకోమన్నారు. ఈ సినిమాకు ఏమైనా ఇబ్బందులు వస్తే తనను సంప్రదించాలని సూచించారు. తాను మాత్రం తన స్నేహితులతో కలిసి సినిమా తీద్దామనుకుంటున్నామని రాంబాబు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కాకినాడ ఆనంద్ థియేటర్లో బ్రో సినిమా విజయయాత్రలో హీరో సాయిథరమ్ తేజ్ పాల్గొన్నారు. మూవీ యూనిట్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించండి అభిమానులకు సూచనలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు