అనారోగ్యంతో తమ్ముడు మృతి..
ప్రముఖ కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగదీశ్వరన్ మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు తమ్ముడు కూడా మృతి చెందడంతో వడివేలు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో..
ఇక జగదీశ్వరన్ కూడా అన్న వడివేలు లాగే సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలు చేసిన ఆయనకు తర్వాత అవకాశాలు తగ్గడంతో సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. దీంతో మధురైలో బట్టల షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాలేయ సంబంధిత సమస్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచారు.
తమిళంతో తెలుగులోనూ ఫ్యాన్స్..
వడివేలు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన కామెడీ టైమింగ్తో కోట్లాది మంది అభిమానులను అలరించారు. తమిళంతో తెలుగులోనూ ఆయన నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఫుల్ జోష్లో కొనసాగిస్తున్న వడివేలు కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
మరుపురాని చిత్రంగా నాయకుడు..
ఈ సమయంలో రజనీకాంత్ చొరవతో చంద్రముఖితో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో వడివేలు నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత 23వ పులకేశి సినిమాతో హీరోగానూ నటించారు. ఇటీవల విడుదలైన మామన్నన్(నాయకుడు) సినిమాలో దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటన అందరినీ విపరతీంగా ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. వడివేలు కెరీర్లోనే ఈ చిత్రం ఓ మైల్స్టోన్గా నిలిచిపోతుంది. ఇక త్వరలో విడుదల కానున్న చంద్రముఖి-2 సినిమాలోనూ ఆయన నటించారు.