Bengaluru Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు.

New Update
Bengaluru Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు

Bengaluru Bandh: కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు బంద్‌కు పిలుపునివ్వడంతో మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏ దయానంద సెలవు ప్రకటించారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం చేస్తూ కన్నడ రైతులు నిరసన వ్యక్తం చేశారు. తాగుకు, సాగుకు నీళ్లు లేని కరవు పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయవద్దంటూ ఆందోళన తీవ్రతరం చేశారు .సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 15 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రానికి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు..

ఆందోళనల నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను ఎప్పుడూ మీతో ఉంటాను అన్నారు. "ఈ ఏడాది వానలు లేకపోవడంతో వ్యవసాయమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని.. వర్షాకాలం తప్ప మనకు తాగునీటి వనరులు లేవు. కన్నడిగులు కావేరీ నదిపై ఆధారపడతాం. కరవు అధ్యయనం కమిటీ- కావేరీ కమిటీ సాంకేతిక నిపుణులు కర్ణాటకలో ప్రస్తుత కరవు పరిస్థితుల గురించి ట్రైబ్యునల్ కోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించాలి. మన నీరు మన హక్కు" అని సుదీప్ పేర్కొన్నారు.

అసలు ఏంటీ కావేరీ జల వివాదం..?

తమిళనాడు-కర్ణాటకల మధ్య సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం నడుస్తోంది. మైసూరు, మద్రాసు ప్రావిన్సుల మధ్య.. 1892లో ఈ వివాదం ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతంలో.. రాజుల పరిపాలన సాగుతుండగా.. మద్రాస్‌ ప్రావిన్స్‌లో బ్రిటీష్‌ పాలన ఉంది. కావేరీ నది జన్మస్థలం కొడుగు జిల్లా తలకావేరీ. దీని పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, పుదుచ్చేరీల్లోనూ ఉంది. కానీ వివాదం మాత్రం ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్యనే రాజుకుంటుంది.

1892లో తొలిసారి మద్రాస్‌- మైసూరుల మధ్య ఒప్పందం..

కావేరీ నదీ జలాలకు సంబంధించి 1892లో తొలిసారి మద్రాస్‌- మైసూరుల మధ్య ఒప్పందం కుదిరింది. నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించగా మద్రాసు ప్రావిన్సు అంగీకరించలేదు. 1910లో కావేరీ నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మైసూరు రాజు సిద్ధమయ్యారు. అయితే మద్రాస్ ప్రావిన్స్ అడ్డు చెప్పడంతో అప్పటి నుంచి వివాదం జరుగుతూనే ఉంది. 1924, 1970ల్లో కూడా పలు ఒప్పందాలు జరిగాయి. చివరగా 1990, జూన్ 2న కావేరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు.

2002లో తారాస్థాయికి చేరిన వివాదం..

2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవివంచడంతో ఇరు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పందం ప్రకారం నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తమిళనాడు కోరింది. కానీ కర్ణాటక మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కర్ణాటకను ఆదేశించింది. తర్వాత సమావేశమైన కావేరీ బోర్డు రోజుకు 0.8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక పాటించలేదు. దీంతో జల వివాదం తీవ్రతరం అయింది. ఇరు రాష్ట్రాలను సినీ నటులు, రాజకీయ నాయకులు రోడ్డెక్కి పోరాటాలకు దిగారు. తర్వాత 2012లోనూ మళ్లీ కావేరీ జలాల వివాదం తలెత్తింది. తాజాగా తమిళనాడుకు 15 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం మొదలైంది.

Advertisment
తాజా కథనాలు