Team India: ఆసియాకప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత్ జట్టుకు బంగ్లాదేశ్ భారీ షాక్ ఇచ్చింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ సేన తడబడి మ్యాచ్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచులో అద్భుతంగా పోరాడిన అక్షర్ పటేల్ గాయపడ్డాడు. ఫీల్డర్ విసిరిన బంతి కారణంగా కుడిచేతి వేలుకు గాయం కాగా.. ఆ తర్వాత తొడ ప్రాంతంలో కూడా గాయమైనట్లు కనిపించింది. ప్రస్తుతం అక్షర్కు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో ఆసియాకప్ ఫైనల్లో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ను హుటాహుటిన శ్రీలంక పంపించారు. ప్రస్తుతం సుందర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టు శిక్షణ శిబిరంలో ఉన్నాడు. బీసీసీఐ పిలుపుతో లంక బయలుదేరి వెళ్లాడు.
ఫైనల్ జరిగే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తోంది. దీంతో పాకిస్థాన్, శ్రీలంక జట్టులతో జరిగిన మ్యాచ్లలో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. అటు టీమిండియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే కూడా 5 వికెట్లతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా భారత్పై అదరగొట్టారు. సిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై రేపటి తుది పోరులో సుందర్కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. ఇక శ్రీలంక కూడా ఫైనల్ మ్యాచ్కు ముందు గాయాల బెడద ఎదుర్కొంటుంది. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు స్పిన్నర్ తీక్షణ గాయపడ్డాడు. మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోకుండా తీక్షణకు రెస్ట్ ఇవ్వాలని లంక మేనేజ్మెంట్ భావిస్తుంది.
మరోవైపు భారత్ స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ ఐపీఎల్కు కూడా దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి బెంగళూరులోని జాతీయ అకాడమిలో ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇటీవల ఫిట్నెస్ సాధించడంతో అయ్యర్ను ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేశారు. పాక్తో జరిగిన మ్యాచులో జట్టులోకి వచ్చిన అయ్యర్ కొంత నిరాశపరిచాడు. తక్కువ పరుగులకే ఔటయ్యాడు. అయితే మళ్లీ గాయం తిరగబెట్టడంతో మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఇంకో 20 రోజుల్లో భారత్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అయ్యర్ కోలుకోకపోతే టీమిండియాకు కొంత నష్టం చేకూరే అవకాశముంది. మరి అక్షర్తో పాటు అయ్యర్ త్వరగా కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇండియా కోసం రూల్స్ మారుస్తారా? ‘పళ్ళు లేని పులి’..!