దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు సమీపంలోని విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా మొత్తం 16 మంది మరణించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పారామెడిక్స్ సహాయంతో కొంతమందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
జోహన్నెస్బర్గ్కు తూర్పు శివార్లలోని బోక్స్బర్గ్ పట్టణంలోని టౌన్షిప్లో ఈ ప్రమాదం జరిగినట్లు దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. ఏంజెలో టౌన్షిప్లోని గుడిసెలో ఉంచిన గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని అత్యవసర సేవల ప్రతినిధి విలియం నట్లడి తెలిపారు. ఈ ఘటనలో 16మంది అక్కడిక్కడే మరణించగా..క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా' గ్యాస్ను వాడుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
కాగా గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్కి రాత్రి 8 గంటలకు గ్యాస్ లీక్ గురించి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నామని.. అది 'విషపూరిత వాయువు' ఉన్న 'సిలిండర్ నుండి గ్యాస్ లీక్' అని తెలిసిందని వెల్లడించారు. జోహన్నెస్బర్గ్ దక్షిణాఫ్రికా వాణిజ్య కేంద్రంగా ఉందని..అక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో మైనర్లు పనిచేస్తున్నారు. బోక్స్బర్గ్లోనే, గతేడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎల్పీజీని తీసుకెళ్తున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయి పేలిపోవడంతో 41 మంది మరణించారు.