- ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు ఢీ..
- మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నవీన్ పట్నాయక్
- మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం
ఒడిశాలోని గంజాం జిల్లా దిగండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖండేదేయులి గ్రామానికి చెందిన కుటుంబం తన కూతురును బెర్హంపూర్ లోని అత్తగారింటిలో దించేందుకు మినీ బస్సులో బయలుదేరారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓఎస్ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. OSRTC బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రూ. 30 వేలు పరిహారం కింద నగదును అందించనున్నట్టు సీఎం ప్రకటించారు.