Vangaveeti Radha Engagement: ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) వారసుడిగా రాజకీయల్లోకి అడుగుపెట్టిన రాధా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వాసుల ప్రియతమ నేతగా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. వంగవీటి రాధా పెళ్లెప్పుడు చేసుకుంటారని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోబోతున్నారు. రాజకీయ నేపథ్యమున్న నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని (Jakkam Pushpavalli) రాధా వివాహం చేసుకోబోతున్నారు. నర్సాపురంలో జరిగిన వీరి ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రాధకృష్ణ తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం ఆనంతరం కొంతకాలం సైలెంట్గా ఉండి వైసీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేన, లేదా వైసీపీలోకి కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు వంగవీటి రాధా కృష్ణ.
మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ వంగవీటి రాధాకు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తుందో, ఆయన ఎక్కడి నుంచి పోటీలో దిగుతారో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రాధా రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో వంగవీటి రాధా జనసేనలో చేరుతారనే టాక్ కూడా ఉంది. అది నిజమో అబద్దమో తెలియదు కానీ త్వరలో మాత్రం వంగవీటి రాధా పెళ్లి పీటలెక్కి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.